అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నూతన ఛైర్మన్గా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షా నియమితులయ్యారు. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుండగా... అతని వారసుడిగా జై షా డిసెంబర్లో బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు ఐసీసీ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఐసీసీ ఛైర్మన్గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొంది.
ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు నేడే(మంగళవారం) ఆఖరి రోజు కాగా.. జై షా రేసులో నిలవడంతో మరెవరూ పోటీ చేయడానికి ముందుకురాలేదు. దాంతో ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా చరిత్ర సృష్టించాడు.

ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 ఓట్లు ఉండగా.. 9 ఓట్లు లభించిన వ్యక్తి గెలుస్తాడు. కానీ జై షా ఎంట్రీతో అతనికి పోటీగా ఎవరూ రాలేదు. దాంతో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జై షా ఇప్పటి వరకు ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉప సంఘం అధిపతిగా ఉన్నారు. ఐసీసీ ఛైర్మన్గా ఎంపికైన ఐదో భారతీయుడిగా జైషా నిలిచాడు. జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు.
బార్క్లే 2020 నవంబర్లో ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించగా.. 2022లో తిరిగి ఎన్నికయ్యాడు. రూల్స్ ప్రకారం పర్యాయానికి రెండేళ్ల చొప్పున ఎవరైనా ఐసీసీ ఛైర్మన్గా మూడు పర్యాయాలు ఉండొచ్చు. న్యూజిలాండ్కు చెందిన బార్క్లే ఇప్పటికే నాలుగేళ్లు పూర్తి చేశాడు. మూడో సారి ఛైర్మన్ పదవికి పోటీ చేయనని బార్క్లే చెప్పాడని ఇప్పటికే ఐసీసీ ప్రకటించింది. నవంబరులో తన పదవీకాలం ముగిసిన తర్వాత తప్పుకుంటాడని పేర్కొంది.
భారత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడైన జై షా.. గత కొన్నేళ్లుగా బీసీసీఐని అంతా తానై నడిపిస్తున్న విషయం తెలిసిందే. బీసీసీఐ షాడో ప్రెసిడెంట్గా.. బాస్గా చలామణి అవుతున్నారు. వరుసగా రెండోసారి సెక్రటరీ అయిన జై షాకు మరో ఏడాది పదవీ కాలం మాత్రమే ఉంది. ఆ తర్వాత బీసీసీఐ రూల్స్ ప్రకారం ఆయన మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలి.
బీసీసీఐలో ఎలాంటి పదవుల్లో కొనసాగకూడదు. ఈ క్రమంలోనే జై షా ఐసీసీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఐసీసీ ఛైర్మన్గా ఆయన 2026 వరకు కొనసాగనున్నాడు.