ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రంగం సిద్దమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ ఈ టోర్నీకి హైబ్రిడ్ మోడల్లో ఆతిథ్యం ఇస్తుండగా.. భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 19(బుధవారం) న్యూజిలాండ్తో జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్ తలపడనుంది. మరుసటి రోజు బంగ్లాదేశ్తో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న దాయాదీ దేశాలు భారత్-పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
8 ఏళ్ల తర్వాత..
దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిర్వహిస్తోంది. కరోనాతో పాటు ఐసీసీ మెగా టోర్నీల కారణంగా ఇన్నాళ్లు ఈ టోర్నీ నిర్వహించలేదు. 1998లో ఐసీసీ నాకౌట్ పేరిట ఈ టోర్నీని ప్రారంభించారు. క్రికెట్ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఈ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించారు. 2002 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు.2006 వరకు ప్రతీ రెండేళ్లు ఒకసారి ఈ టోర్నీ జరగ్గా.. టీ20 ప్రపంచకప్ రాకతో ఆ తర్వాత మూడు, నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఎడిషన్లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ ఓడించి మరి టైటిల్ కైవసం చేసుకుంది.

కొంపముంచిన బుమ్రా..
పాకిస్థాన్ జరిగిన నాటి ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా చేసిన తప్పిదం టీమిండియా పతనాన్ని శాసించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఫకార్ జమాన్(106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 114) శతకంతో చెలరేగాడు. అయితే 3 పరుగుల వ్యక్తిత స్కోర్ వద్దనే ఫకార్ జమాన్.. బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఈ బంతి నోబాల్ కావడంతో అతను ఔటయ్యే ప్రమాదం నుంచి బచాయించాడు. ఈ అవకాశంతో ఫకార్ జమాన్ సెంచరీతో చెలరేగాడు.
బుమ్రా చేసిన తప్పిదం మూమెంటమ్ను దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో బుమ్రా 9 ఓవర్లు బౌలింగ్ చేసి 68 పరుగులు సమర్పించుకున్నాడు. అతని కెరీర్లోనే ఈ మ్యాచ్ ఓ మచ్చలా మిగిలిపోయింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ మహమ్మద్ అమీర్ ధాటికి 158 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. హార్దిక్ పాండ్యా(43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 76) మినహా అంతా విఫలమయ్యారు. రోహిత్ శర్మ(0) డకౌటవ్వగా.. కోహ్లీ 5 పరుగులే చేశాడు. అప్పట్లో బుమ్రా నోబాల్ తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ పోలీసులు సైతం లైన్ ధాటితే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని బుమ్రా నోబాల్ను హోర్డింగ్స్గా వాడుకున్నారు.
ఈసారి ఎవరో..?
వెన్ను నొప్పితో బుమ్రా ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం లేదు. ప్రస్తుతం టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను 3-0క్లీన్ స్వీప్ చేసింది. జట్టులోని ఆటగాళ్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. ఐదుగురు స్పిన్నర్లతో టీమిండియా దుబాయ్కి వెళ్లింది.