ఇంగ్లండ్తో మూడో టెస్ట్ రెండో రోజు ఆట అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నవ్వులు పూయించాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బుమ్రా సమాధానం చెబుతుండగా.. తన ముందే ఉన్న రిపోర్టర్ల మొబైల్స్లోని ఒక ఫోన్ మోగింది. వెంటనే ఆ ఫోన్ చూసిన బుమ్రా..'ఎవరి భార్యో ఫోన్ చేస్తున్నారు. కానీ నేను ఎత్తను'అని అన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మీడియా సమావేశంలో బుమ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సిరీస్ సందర్భంగా డ్యూక్స్ బాల్స్ నాణ్యతపై తీవ్ర చర్చ జరుగుతుండగా.. వాటి గురించి స్పందించేందుకు బుమ్రా నిరాకరించాడు. బాల్స్ గురించి మాట్లాడి మ్యాచ్ ఫీజును కోల్పోవాలనుకోవడం లేదన్నాడు. 'బంతి మార్పులను నియంత్రించడం కష్టం. అయితే ఈ వ్యవహారంపై మాట్లాడి నా మ్యాచ్ ఫీజులో కోతను విధించుకోవాలనుకోవడం లేదు. చాలా కష్టపడి ఆడా. చాలా ఓవర్లు బౌలింగ్ వేశా. కాబట్టి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

బుమ్రా ఏది చెబితే అది ఫాలో అవుతామని తొలి రోజు ఆట అనంతరం నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఈ విషయాన్ని బుమ్రా ముందు ప్రస్తావించగా.. నితీష్ అలా చెప్పాల్సింది కాదన్నాడు. 'నితీష్ చెప్పిన సమాధానం తప్పు. అతను నన్నేమి అడగలేదు. నేను అతనికేం చెప్పలేదు. అయితే నితీష్ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. మా నుంచి ఇలాంటి కుర్రాళ్లకు మరింత గైడెన్స్ అవసరం లేదు. నా అవసరం ఎప్పుడు ఉన్నా వారికి తప్పకుండా అందుబాటులో ఉంటా. నా అనుభవాలు పంచుకుంటా. ఇక్కడ గత పర్యటనట్లో నేర్చుకున్న విషయాలను వారికి చెబుతా. సింపుల్గా ఉండాలని సూచిస్తా. ప్రతీ విషయంలో కలగజేసుకోను. నా టెక్నిక్, బౌలింగ్ భిన్నం. కాబట్టి కొన్నిసార్లు నా టిప్స్ పనిచేయకపోవచ్చు.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. దాంతో అతని పేరు లార్డ్స్ ఆనర్స్ బోర్డుకు ఎక్కింది. దీనిపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. 'లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరు ఎక్కడం సంతోషంగా ఉంది. ప్రతీసారి కెమెరాలు ఆటగాళ్లపైనే ఉంటాయి. ప్రాక్టీస్ చేస్తున్నా చుట్టూ ఓ కన్నేసి ఉంటాయి. వ్యూస్, సబ్స్క్రైబర్ల కాలంలో ఇది మరీ ఎక్కువ. ప్రతీ ఒక్కరూ తమకంటూ సంచలన సృష్టించాలని కోరుకుంటారు. వాటిని ఆపడం మనవల్ల కాదు. ఎలా ఆడినా మనల్ని జడ్జ్ చేసేవాళ్లు ఉంటారు. సచిన్ 200 టెస్ట్లు ఆడినా.. ఆయనపై భిన్నాభిప్రాయలు వ్యక్తం చేసేవారు ఉన్నారు.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.