ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టులో అనిశ్చితి కొనసాగుతోంది. నూతన సారథిగా హార్దిక్ పాండ్యాను ప్రకటించడాన్ని ఆ జట్టులో మెజార్టీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
చివరకు రోహిత్ శర్మతో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా మేనేజ్మెంట్ నిర్ణయాన్ని స్వాగతించలేకపోతున్నారు. సూర్య, బుమ్రా.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్కు తెరలేవనుండగా.. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా జట్టుతో కలవకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ తమ పూర్తి జట్లతో ప్రాక్టీస్ మ్యాచ్లు.. జెర్సీ ఆవిష్కరణలతో హడావుడి చేస్తుంటే.. ముంబై మాత్రం సైలెంట్గా ఉంది.
బుమ్రా మార్చి 21న నేరు అహ్మదాబాద్ వేదికగా జట్టుతో కలుస్తాడని ముంబై ఇండియన్స్ టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ అనంతరం నేరుగా ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ముంబై తొలి మ్యాచ్ మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఉండటం.. 21న బుమ్రా ముంబై జట్టుతో కలవనున్నాడు. తొలి మ్యాచ్కు ముందు అతనికి మూడు రోజుల ప్రాక్టీస్ సరిపోతుందని ముంబై టీమ్స్ వర్గాలు పేర్కొన్నాయి.
మార్చి 12నే ముంబై ప్రీ సీజన్ ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభం కాగా.. మార్చి 18న రోహిత్ శర్మ జట్టుతో కలిసాడు. చీలమండ గాయంతో ఆటకు దూరమైన సూర్యకుమార్ యాదవ్ రావడంపై ఎలాంటి క్లారిటీ లేదు. అతనికి ఎన్సీఏ నుంచి ఫిట్నెస్ విషయంలో అతనికి క్లియరెన్స్ రావాల్సి ఉంది.