
ఆక్లాండ్ : ఓవైపు ప్రత్యర్థి, వేదికలతో సంబంధం లేకుండా టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంటే.. మరోవైపు ఆటగాళ్ల గాయాలు జట్టును వెంటాడుతున్నాయి. ఇప్పటికే శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, హార్ధిక్ పాండ్యా గాయాల నేపథ్యంలోనే న్యూజిలాండ్ టూర్కు దూరమయ్యారు. ఇప్పుడు తాజాగా జస్ప్రీత్ బుమ్రా కూడా గాయపడ్డాడు.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్లతో గెలుపొంది మూడు వారాల సుదీర్ఘ టూర్ను ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ గెలుపున ఆస్వాదిస్తున్న అభిమానులకు బుమ్రా గాయం కలవరపాటుకు గురిచేస్తోంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు.
రెండో బంతి వేసే క్రమంలో అతని ఎడమ కాలు జారడంతో పాదం బెణికింది.నొప్పితో విలవిలలాడిన బుమ్రా.. ఫిజియో ప్రాథమిక చికిత్సతో మిగతా ఓవర్ పూర్తి చేశాడు. అయితే రన్ చేయడంలో అతను కొంచెం ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ అనంతరం బుమ్రాను స్కానింగ్కు పంపించారని, వెంట్రుక మందం ఫ్రాక్చర్ ఉండొచ్చిని టీమ్ ఫిజియో చెప్పినట్లు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే అతని గాయంపై స్పష్టత రానుంది. ఇక బుమ్రా జట్టుకు దూరమైతే కోహ్లీ సేనకు కష్టాలు తప్పవు.
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల భారీ టార్గెట్ను ఓ ఓవర్ మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. రోహిత్ శర్మ(7) విఫలమైనా కేఎల్ రాహుల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 56), విరాట్ కోహ్లి( 32 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్తో 45), శ్రేయస్ అయ్యర్( 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 58 నాటౌట్) లు రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో టీ20 ఆదివారం జరగనుంది.