ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సెటైరికల్ పోస్ట్ షేర్ చేశాడు. సపోర్ట్ చేసేవారు ఒక్కరుంటే.. సక్సెస్ సాధించిన తర్వాత అభినందనలు తెలిపేవారు చాలా మంది ఉంటారని అర్థం వచ్చేలా ఓ ఫొటోను పంచుకున్నాడు.
ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. బుమ్రా షేర్ చేసిన ఈ సెటైరికల్ పోస్ట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుమ్రా చెప్పిన మాట వాస్తవమంటూ అతనితో కొందరు ఏకీభవిస్తుంటే మరికొందరు మాత్రం అతి చేయడం అంటే ఇదేనని విమర్శలు గుప్పిస్తున్నారు.

వెన్నునొప్పితో జట్టుకు దూరమై ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు.. పేలవ ప్రదర్శన కనబర్చినప్పుడు దొరకని మద్దతు.. అసాధారణ ప్రదర్శన కనబర్చిన తర్వాత అభినందనల రూపంలో దక్కడం చూసి బుమ్రా ఆశ్చర్యపోయాడని, అతను చెప్పిన మాట నిజమని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం బుమ్రాకు ఓవరాక్షన్ ఎక్కువైందని, ఐపీఎల్ కోసం అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండే అతను కూడా నీతులు చెబుతున్నాడని మండిపడుతున్నారు.
ఇంకొందరు మాత్రం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై కోపంతో ఈ సెటైరికల్ పోస్ట్ షేర్ చేశాడంటున్నారు. రోహిత్ను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని బుమ్రా జీర్ణించుకోలేకపోతున్నాడని, ఆ స్థానాన్ని తాను కోరుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్ల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన బుమ్రా.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టెస్ట్ల్లో నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్న తొలి భారత పేసర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.
బుమ్రా 881 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. కగిసో రబడా(851) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న అశ్విన్(841) రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానంలో నిలిచాడు.