
దుబాయ్: తీరిక లేని షెడ్యూల్, బయో బబుల్స్ ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని, దాని ఫలితమే ఈ ఘోర పరాజయాలని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో చిత్తయింది. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. ఈ వరుస ఓటముల నేపథ్యంలో అటు ఆటగాళ్లు, ఇటు మేనేజ్మెంట్పై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమి కంటే భారత్ ఆడిన తీరును చూసిన ఆవేదన చెందుతున్నారు.
కొందరు జట్టు సెలక్షన్ను తప్పుపడుతుంటే మరికొందరు బిజీ షెడ్యూల్పై మండిపడుతున్నారు. ఆరు నెలలుగా భారత జట్టు బయోబబుల్లో ఉండటం వల్ల ఆటగాళ్లు మానసికంగా అలిసిపోయారని విమర్శిస్తున్నారు. అయితే మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న బుమ్రా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కుటుంబాలకు దూరంగా బయో బబుల్స్లో ఉండటం వల్ల ఆ ప్రభావం ఆటగాళ్లపై పడుతోందని తెలిపాడు.
'ఆటగాళ్లకు కొన్నిసార్లు విశ్రాంతి అవసరం. కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. ఆరు నెలలుగా విరామం లేకుండా ఆడుతున్నాం. ఇంత సుదీర్ఘ కాలం కుటుంబానికి దూరంగా, బయోబబుల్లో ఉండటం వల్ల ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మేమంతా సౌకర్యవంతంగా ఉండేందుకు బీసీసీఐ సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తోంది. ఇది చాలా కష్టసమయం. మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. అందువల్ల ఈ బబుల్కు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నాం. మానసిక అలసట కూడా వేధిస్తోంది.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ పర్యటన తర్వాత ఐపీఎల్ కోసం యూఏఈకి చేరిన భారత ఆటగాళ్లు.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ కోసం సిద్దమయ్యారు. అయితే బుమ్రా వ్యాఖ్యల నేపథ్యంలో అభిమానులు బీసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కాసుల కోసం కక్కుర్తి పడి టీ20 ప్రపంచకప్ను బలి ఇచ్చిందని ఘాటుగా విమర్శిస్తున్నారు. మెగా టోర్నీల్లో భారత వైఫల్యానికి కారణమవుతున్న ఐపీఎల్ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్ వేదికగా #BANIPL అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.