చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఓడించడంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ లో-స్కోరింగ్ థ్రిల్లర్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా(3/14) నిప్పులు చెరిగాడు.
సంచలన బౌలింగ్తో పాక్ పతనాన్ని శాసించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై స్పందించిన బుమ్రా.. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు బౌలింగ్ చేసి ఫలితాన్ని రాబట్టానని తెలిపాడు. ఆరంభంలో తాము విధించిన లక్ష్యం సరిపోదనుకున్నాని, సూర్యుడి రాకతో పిచ్ కూడా మెరుగవడంతో గెలవడం కష్టమని భావించానన్నాడు.

'ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. మేం విధించిన లక్ష్యం సరిపోదనుకున్నా. సూర్యుడి రాకతో పిచ్ కూడా చాలా మెరుగైంది. అయినా మేం క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఫలితాన్ని రాబట్టాం. వీలైనంత వరకు సీమ్ను హిట్ చేసే ప్రయత్నం చేశాను. నా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేశాను.
నా బౌలింగ్ ప్రదర్శన నాకు సంతృప్తినిచ్చింది. ప్రేక్షకుల మద్దతుతో అమెరికాలో ఆడుతున్నా.. భారత్లో ఆడుతున్నట్లే ఉంది. వారి అభిమానం మైదానంలో మా శక్తిని పెంచుతోంది. మేం ఆడిన రెండు మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చాం. ఇలానే ఆడుతూ మా జోరును కొనసాగిస్తాం.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20) మినహా అంతా విఫలమయ్యారు.
8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(3/21), హ్యారీస్ రౌఫ్(3/21) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ అమీర్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది(2/29) ఒక వికెట్ తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్తో 31) మినహా అంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్(1/31), అక్షర్ పటేల్(1/11)తలో వికెట్ తీసారు.