టీమిండియాలో ఇష్టమైన కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. అంతేకాకుండా తాను ఆడిన ముగ్గురు సారథులు మహేంద్ర సింగ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. ధోనీ సారథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. కోహ్లీ కెప్టెన్సీలో స్టార్ బౌలర్గా ఎదిగాడు.
రోహిత్ శర్మ సారథ్యంలో మరింత స్వేచ్చగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఈ ముగ్గురు సారథుల్లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరా? అనే ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు.'టీమిండియాలో చాలా మంది గొప్ప సారథులు ఉన్నారు. అందులో నా పేరు కూడా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా కెప్టెన్సీకే నేను పెద్ద అభిమానిని.'అని తెలివిగా బదులిచ్చాడు.

ధోనీ, రోహిత్, కోహ్లీ కెప్టెన్సీల మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరించాడు. 'ధోనీ నాయకత్వంలోనే నేను అరంగేట్రం చేశాను. జట్టులో స్థానంపై ఆటగాడికి భద్రత కల్పిస్తాడు. అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేలా చేస్తాడు. కుర్రాళ్లపై నమ్మకం ఉంచుతాడు. జట్టుకు అవసరమైన వాటిపైనే ఫోకస్ పెడుతాడు. ప్లానింగ్ను పెద్దగా పట్టించుకోడు.
ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. మైదానంలో అత్యంత ఉత్సాహంగా.. దూకుడుగా ఉంటాడు. ఆటపై అతనికి ఉన్న నిబద్ధత అద్భుతం. ఎప్పుడూ విజయం సాధించాలనే పట్టుదలతోనే ఉంటాడు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీనే మాకు ఆదర్శం. ఇప్పుడు విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్ కాకపోవచ్చు. కానీ, ఎప్పటికీ అతనే మా నాయకుడు. కెప్టెన్సీ అనేది ఓ పదవి మాత్రమే.
బౌలర్లపై సానుభూతి తెలిపే అతికొద్ది మంది సారథుల్లో రోహిత్ శర్మ ఒకడు. ప్లేయర్ల భావోద్వేగాలను అర్థం చేసుకుంటాడు. బయటకు కనిపించేంతగా రోహిత్ కఠినంగా వ్యవహరించడు. ప్రతీ ఒక్కరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.'అని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ విజయానంతరం విశ్రాంతిలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనున్న నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ జరగనుండగా.. నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.