రివర్స్ స్వింగ్తో వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించానని టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో బుమ్రా(6/45) నిప్పులు చెరిగాడు. 6 వికెట్ల ఘనతతో పాటు టెస్ట్ల్లో 150 వికెట్ల మైలురాయి అందుకున్నాడు.
బుమ్రా సంచలన ప్రదర్శనతో టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ జియోసినిమాతో మాట్లాడిన బుమ్రా.. తన బౌలింగ్ ప్లాన్స్ను వివరించాడు.'రివార్డ్స్ అందుకున్నప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటారు. నేను కూడా ఈ 6 వికెట్ల ప్రదర్శనతో ఆనందంగా ఉన్నాను.

భారత్లో రివర్స్ స్వింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దేశంలో పుట్టిన నాకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. భారత్లో రాణించాలంటే రివర్స్ స్వింగ్ చేయడం నేర్చుకోవాలి. నేను ఈ మ్యాచ్లో రివర్స్ స్వింగ్తో బ్యాటర్లను బోల్తా కొట్టించాను. దిగ్గజ బౌలర్ల రివర్స్ స్వింగ్.. బ్యాటర్లను ఔట్ చేసే విధానం, మ్యాజికల్ డెలివరీలను చూస్తూ పెరిగాను.
దాంతో రివర్స్ స్వింగ్ చేయడం నాకు అలవాటైంది. ఈ రోజు ఆ రివర్స్ స్వింగ్తో ఫలితం రాబట్టినందుకు సంతోషంగా ఉంది. రివర్స్ స్వింగ్ చేసినప్పుడు బ్యాటర్లు అయోమయానికి గురవుతారు. ఈ మ్యాచ్లో నేను ఇన్స్వింగ్, ఔట్స్వింగ్తో పాటు యార్కర్లు కూడా వేసాను. పోప్ వికెట్ తర్వాత బ్యాటర్లు ఇన్స్వింగర్ కోసం వేచి చూస్తున్నారని నేను గ్రహించాను.
బ్యాటర్ల అంచనాపై నిఘా వేస్తూ బంతులు సంధించాను. ఈ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రికార్డులు, నెంబర్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను. ఈ రికార్డులను పట్టించుకుంటే అనవసర ఒత్తిడి నెలకొంటుంది. ఇవేవి పట్టించుకోకపోతేనే మన ఆటను మనం ఆస్వాదించగలం'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
జస్ప్రీత్ బుమ్రా(6/45) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 55.3 ఓవర్లలో 253 పరుగులకు కుప్పకూలింది. ఆ జట్టులో జాక్ క్రాలీ(78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బెన్ స్టోక్స్(47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా(6/45) సిక్సర్ కొట్టగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.
యశస్వి డబుల్..
అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్లతో 209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/47), షోయబ్ బషీర్(3/138), రెహాన్ అహ్మద్(3/65) మూడేసి వికెట్లు తీసాడు. టామ్ హార్ట్లీకి ఓ వికెట్ దక్కింది. ఓవర్నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులు మాత్రమే చేసింది.