బౌలర్గా తాను మొట్ట మొదట నేర్చుకున్న బంతే యార్కర్ అని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. ఇంగ్లండ్తో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా 106 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో బుమ్రా 9 వికెట్లతో సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఈ అవార్డు స్వీకరించే క్రమంలో బుమ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హోస్ట్ హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. 9 వికెట్ల ప్రదర్శన నేపథ్యంలో అతని రికార్డుల గురించి ప్రస్తావించగా వాటిని తాను పట్టించుకోనని, గత ఇంటర్వ్యూలోనే స్పష్టం చేశానని గుర్తు చేశాడు.

'నేను ముందే చెప్పినట్లు రికార్డులు, నంబర్స్ను అస్సలు పట్టించుకోను. వాటిని పట్టించుకుంటే అనవసర ఒత్తిడి నెలకొంటుంది. దాంతో మన ఆటను మనం ఆస్వాదించలేం. కుర్రాడిగా ఉన్నప్పుడు ఈ రికార్డులు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేవి. కానీ ఇప్పుడు అవి అదనపు బ్యాగేజ్ మాత్రమే అనిపిస్తున్నాయి.
కుర్రాడిగా నేను నేర్చుకున్న మొదటి డెలివరీ యార్కర్. అప్పట్లో ఈ డెలివరీ వేస్తేనే వికెట్లు దక్కేవి. దిగ్గజాల ఆటను చూస్తూ బౌలింగ్ నేర్చుకున్నా. వకార్, వసీం, జహీర్ ఖాన్ బౌలింగ్ను నిశితంగా పరిశీలించి ఆ డెలివరీలను ప్రాక్టీస్ చేసేవాడిని. జట్టులో నేనేం బౌలింగ్ కెప్టెన్ కాదు. ఓ సీనియర్ పేసర్గా కుర్రాళ్లకు అండగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది.
అలానే పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఎలాంటి బాల్స్ వేయాలి. ఎలా బౌలింగ్ చేయాలని చెప్పే బాధ్యత ఉంది. ఇవే విషయాలను నేను మా బౌలర్లతో మైదానంలో చర్చిస్తాను. రోహిత్ శర్మతో డిస్కషన్స్ కూడా మ్యాచ్కు సంబంధించినవే. ఇద్దరం కలిసి సుదీర్ఘ కాలంగా ఆడుతున్నాం. మా మధ్య ఎలాంటి వాగ్వాదాలకు చోటు ఉండదు.
ఇక జేమ్స్ అండర్సన్తో పోటీ పడాలని ఎప్పుడు అనుకోను. అతనే కాదు ఏ ఫాస్ట్ బౌలర్ అద్భుత ప్రదర్శన కనబర్చినా వారిని మెచ్చుకుంటా. క్రికెటర్ కన్నా ముందు నేను ఫాస్ట్ బౌలింగ్ అభిమానిని. నేను పరిస్థితులను చూసి అందుకు తగ్గట్లు బౌలింగ్ చేస్తాను. నా ఆప్షన్స్ అన్నింటిని ప్రయోగిస్తాను. ఎప్పుడూ ఒక్క లైన్లో బౌలింగ్ వేయను.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లోనే బుమ్రా టెస్ట్ల్లో 150 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. 34 టెస్ట్ల్లో 20.19 యావరేజ్తో 155 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు.
అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకు కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(6/45) 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో భారత్కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.రెండో ఇన్నింగ్స్లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్(104) ఒక్కడే సెంచరీ సాధించగా.. అక్షర్ పటేల్(45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
దాంతో ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యం నమోదమవ్వగా.. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. జాక్ క్రాలీ(132 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 73) ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. బెన్ ఫోక్స్(69 బంతుల్లో 4 ఫోర్లు సిక్స్తో 36), టామ్ హార్ట్లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(3/72), జస్ప్రీత్ బుమ్రా(3/46) మూడేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.