Jasprit Bumrah: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్కు దూరమయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిపాలైన అభిషేక్ శర్మ.. నమీబియాతో రెండో టీ20 ఆడేది సందేహంగా మారింది. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ గాయపడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. గాయం పెద్దదా? చిన్నదా? అనేదానిపై క్లారిటీ లేదు.
తీవ్ర జ్వరంతో తొలి మ్యాచ్కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించాడు. నమీబియాతో మ్యాచ్ ఆడేందుకు రెడీ అయ్యాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో బుమ్రా బౌలింగ్ చేశాడు. గంటలకొద్దీ బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన బుమ్రా.. యార్కర్, వైడ్ యార్కర్, కట్టర్, స్లోయర్, షార్ట్ పిచ్ బాల్స్ను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు.

ఈ క్రమంలోనే బుమ్రా వేసిన కళ్లు చెదిరే యార్కర్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఇషాన్ కిషన్ పాదానికి బలంగా తాకింది. గంటకు 148 మీటర్ల వేగంతో సంధించిన ఈ యార్కర్కు ఇషాన్ కిషన్ క్రీజులోనే కుప్పకూలాడు. నొప్పితో విలవిలలాడుతూ.. పిల్ల మొగ్గలు వేసాడు. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత కుంటుతూ కనిపించాడు. జస్ప్రీత్ బుమ్రా వచ్చి ఇషాన్ కిషన్ సారీ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇషాన్ కిషన్ గాయంపై మాత్రం స్పష్టత లేదు.
ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ గాయం గురించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే అభిషేక్ శర్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండగా.. అతని స్థానంలో సంజూ శాంసన్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇషాన్ కిషన్ గాయం తీవ్రత ఎక్కువైతే ఎవరు ఆడుతారనేది? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్గా బరిలోకి దిగితే.. వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి రావాల్సి ఉంటుంది.
అమెరికాతో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా.. నమీబియాతో తమ అసలు ఆట చూపించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సూపర్ 8 అవకాశాలను మెరుగుపర్చుకోవడంతో పాటు పాకిస్థాన్తో పోరుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనే యోచనలో ఉంది. న్యూఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో డ్యూ ప్రభావం చూపే అవకాశం ఉంది.