సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ను భారత బౌలర్లు ఘనంగా ప్రారంభించారు. కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా(5/27) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31), వియాన్ మల్డర్(51 బంతుల్లో 3 ఫోర్లతో 24), ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 4 ఫోర్లతో 23), టోనీ డీ జోర్జి(55 బంతుల్లో ఫోర్, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.

టాస్ గెలిచిన బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్(31), ర్యాన్ రికెల్టర్(23) శుభారంభం అందించారు. వన్డే తరహా బ్యాటింగ్తో దూకుడుగా ఆడిన ఈ జోడీ తొలి వికెట్కు 57 పరుగులు జోడించింది. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని జస్ప్రీత్ బుమ్రా విడదీసాడు. ర్యాన్ రికెల్టన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లో మార్క్రమ్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ టెంబా బవుమా(3)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చగా.. టోనీ డీ జోర్జితో కలిసి వియాన్ మల్డర్ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దాంతో సౌతాఫ్రికా 105/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లో భారత బౌలర్లు చెలరేగారు. వియాన్ మల్డర్ను కుల్దీప్ యాదవ్ వికెట్ల ముందు బోల్లా కొట్టించాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కైల్ వెర్రెన్(16), మార్కో జాన్సెన్(0)లను సిరాజ్ ఒకే ఓవర్లో ఔట్ చేయడంతో సౌతాఫ్రికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కార్బిన్ బోచ్(5)ను అక్షర్ పటేల్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా సౌతాఫ్రికా 154/8తో టీ బ్రేక్ వెళ్లింది. మూడో సెషన్ ఆరంభంలోనే మూడు బంతుల వ్యవధిలోనే సిమన్ హర్మర్(5), కేశవ్ మహరాజ్(0)లను బుమ్రా ఔట్ చేసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు తెరదించాడు.