హైదరాబాద్: ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనష్యులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు. అయితే ఆ మిగతావారి సంగతి దేవుడెరుగు. కానీ టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పోలిన వ్యక్తి మాత్రం మన హైదరాబాద్లోనే ఉన్నాడు. అచ్చం అతనిలానే ఏమాత్రం గుర్తుపట్టకుండా బుమ్రానే అని పొరపడేలా కనిపిస్తున్నాడు.
అతనెవరో కాదు తెలంగాణ స్టేట్ వాకర్ రాజ్ మిశ్రా. అవును.. సికింద్రబాద్కు చెందిన ఈ రాజ్ మిశ్రాను అందరూ బుమ్రానే అనుకొని పొరబడుతుంటారంట. ఆ తర్వాత నిజం తెలుసుకొని క్షమాపణలు చెబుతారని ఈ హైదరాబాద్ బుమ్రా తెలంగాణ టుడేతో నవ్వుతూ చెప్పుకొచ్చాడు. 'కొన్నిసార్లు ప్రజలు నన్ను చూసి ఆశ్చర్యపోతారు. బుమ్రా అని పిలుస్తారు. ఆ తర్వాత వాస్తవం తెలుసుకొని క్షమాపణలు చెబుతారు. ఇలా నాకు తరుచూ జరుగుతూనే ఉంటుంది.'అని తెలిపాడు.
ఇక తెలంగాణ తరఫున నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో పాల్గొన్న రాజ్ మిశ్రా.. ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది జరిగే నేషనల్స్పై సీరియస్గా దృష్టిసారించానని తెలిపిన మిశ్రా.. తన ప్రణాళికలను కరోనా దెబ్బతీసిందని వాపోయాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈఎమ్ఈ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్న మిశ్రా.. కరోనా పరిస్థితుల్లో కూడా ఏనాడు ప్రాక్టీస్ తప్పలేదన్నాడు.
క్రికెట్ను దైవంగా భావించే భారత్లో ఆటగాళ్లపై అభిమానంతో వారి వేషభాషలను అనుకరిస్తారు. అచ్చం అలానే కనిపిస్తారు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ డూప్లు కూడా ఉన్నారు. అయితే రాజ్ మిశ్రా మాత్రం ఎలాంటి అనుకరణ లేకుండానే సహజమైన పోలీకలను కలిగి ఉండటం గమనార్హం. ఇక యార్కర్ల కింగ్గా గుర్తింపు తెచ్చుకున్న బుమ్రా.. అనతి కాలంలోనే భారత ప్రధాన పేసర్గా ఎదిగాడు. ఇక వెన్ను నొప్పితో భారత జట్టుకు దూరమైన ఈ యార్కర్ల కింగ్ పునరాగమనంలో ఒకప్పటిలా సత్తా చాటలేకపోయాడు. పరుగులు నియంత్రించినా వికెట్లు తీయడంలో తడబడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు.
కోహ్లీతో వద్దు.. పాకిస్థాన్ దిగ్గజాలతో పోల్చండి: స్టార్ క్రికెటర్