ఓ బౌలర్గా సహచర ఆటగాళ్లకు అతిగా సలహాలు ఇవ్వనని, వారికున్న అనుమానాలను తీర్చే ప్రయత్నమే చేస్తానని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జస్ప్రీత్ బుమ్రాను.. పెద్దగా అనుభవం లేని సిరాజ్, అర్ష్దీప్ సింగ్ వంటి బౌలర్లకు సలహాలు ఇస్తారా? అని ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఎవరికైనా సరే అతిగా చెప్పడం చేయకూడదు. నా కెరీర్లో నేర్చుకున్న విషయం ఇదే. సాయం కోసం మన వద్దకు వచ్చేవారిని.. వారికున్న అనుమానాలు అడిగేందుకు అవకాశం ఇస్తా. ఏమీ అడగకుండా ఎక్కువగా చెప్పకూడదు. అలా చేస్తే వారిపై మరింత ఒత్తిడి పెట్టినట్లు అవుతుంది. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు అమెరికాలో అడుగుపెట్టినవారంతా అదృష్టవంతులే.

అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకొనేందుకు వారికి ఇది ఒక మంచి అవకాశం. యువ బౌలర్లకు కావాల్సిన సమాచారం ఇచ్చేందుకు మాత్రం నేను సిద్దంగా ఉంటా. ఎవరైనా క్రికెట్ ప్రయాణంలో నేర్చుకోవాల్సిందే. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ను మెరుగుపరుచుకుంటారు.
వెన్ను నొప్పితో సుదీర్ఘ కాలం పాటు నేను ఆటకు దూరంగా ఉన్నాను. దాంతో రీఎంట్రీలో ఆటను ఆస్వాదించడం అలవాటుగా మార్చుకున్నా. నేను అనుకున్నట్లు సరైన ప్రాంతంలో బౌలింగ్ చేయగలిగాను. కొన్ని అంశాలు మనం అనుకున్నట్లు జరగవు. వాటిని పక్కన పెట్టేసి ఆటపైనే దృష్టిసారించా.
గాయం నుంచి కోలుకున్నాక మళ్లీ కొత్తగా గేమ్ను ప్రారంభించా. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఫలితం ఎలా ఉన్నా సరే సాయశక్తులా ప్రయత్నం మాత్రం చేస్తా. ఆటను ఆస్వాదించడం వల్ల అనవసరంగా పడే ఒత్తిడిని తగ్గించుకోగలం. యార్కర్లను పక్కాగా వేసేందుకు చాలా కష్టపడ్డా.
టెన్నిస్, రబ్బర్ బాల్స్తో క్రికెట్ ఆడి ఇక్కడికి వచ్చా. సమ్మర్ క్యాంప్స్లో ఎక్కువగా యార్కర్లను వేసేవాడిని. వికెట్లు తీయడంపైనే ఫోకస్ పెట్టేవాడిని. ఫాస్ట్ బౌలింగ్తో పాటు వైవిధ్యంగా బంతులేయాలి. ఇప్పటికీ యార్కర్లపై సాధన చేస్తుంటా. ప్రతీది మనం మెరుగు కావాడానికి కీలకం. 'అని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.