ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో బోణి కొట్టిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. గురువారం (జూన్ 10) నుంచి లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో టెస్ట్లో ఆతిథ్య ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఓటమి పాలైన భారత్.. ఎడ్జ్బాస్టన్లో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొంది చారిత్రాత్మక విజయాన్నందుకుంది. ఇదే జోరును లార్డ్స్ టెస్ట్లో కొనసాగించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఎడ్జ్బాస్టన్లో గెలుపొందడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించినా.. తుది జట్టులో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ముఖ్యంగా లార్డ్స్ టెస్ట్కు టీమిండియా మూడు మార్పులు చేసే ఛాన్స్ ఉంది.

వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ టెస్ట్కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా.. లార్డ్స్ టెస్ట్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బుమ్రా రీఎంట్రీ ఇస్తే..తుది జట్టులో ఎవర్ని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బుమ్రా స్థానంలో రెండో టెస్ట్ ఆడిన ఆకాశ్ దీప్(4/88, 6/99) 10 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టెస్ట్లో విఫలమైన సిరాజ్(6/70, 1/57) మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో రెండు టెస్ట్ల్లో విఫలమైన ప్రసిధ్ కృష్ణపై వేటు పడనుంది. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ల్లో అతను ధారళంగా పరుగులిచ్చాడు. బుమ్రా కోసం ప్రసిధ్పై వేటు వేసే అవకాశాలు ఉన్నాయి.
ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్గా రెండో టెస్ట్ ఆడిన వాషింగ్టన్ సుందర్పై కూడా వేటు పడనుంది. లోయరార్డర్ బ్యాటర్గా సుందర్ తన బాధ్యత నిర్వర్తించినా.. బౌలింగ్లో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ఫ్లాట్ వికెట్పై స్పిన్నర్లకు పెద్దగా మద్దతు కూడా లభించలేదు. అయితే లార్డ్స్ వికెట్ పేస్కు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే టీమిండియా ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అర్ష్దీప్ సింగ్ను ఆడించవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడు. సుందర్ను కొనసాగించాలనుకుంటే పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై వేటు పడుతుంది.
వరుసగా రెండు టెస్ట్ల్లో విఫలమైన కరుణ్ నాయర్పై కూడా వేటు పడే అవకాశం ఉంది. నాలుగు ఇన్నింగ్స్ల్లో అతను 0, 20, 31, 26 పరుగులు మాత్రమే చేశాడు. రెండో టెస్ట్లో ఫస్ట్ డౌన్కు ప్రమోట్ చేసినా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. కరుణ్ నాయర్కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం అతను లార్డ్స్ టెస్ట్ ఆడుతాడు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ విభాగం కూడా బలంగా మారితే భారత్కు తిరుగుండదు.
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్/కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్/అర్ష్దీప్ సింగ్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్.