ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో ఆడనుండగా.. గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
229 పరుగుల లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 80), వాషింగ్టన్ సుందర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 48) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(2/56) రెండు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్, మిచెల్ సాంట్నర్, అశ్వని కుమార్ తలో వికెట్ తీసారు.

హార్దిక్ పాండ్యా విధ్వంసం
అంతకు ముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 81) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జానీ బెయిర్ స్టో(22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 47), సూర్యకుమార్ యాదవ్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 33), హార్దిక్ పాండ్యా(9 బంతుల్లో 3 సిక్స్లతో 22 నాటౌట్) వేగంగా పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(2/53), సాయి కిషోర్(2/42) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/37) ఓ వికెట్ పడగొట్టాడు. ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా చేసిన పరుగులతో పాటు బుమ్రా(1/27) అసాధారణ బౌలింగ్ ముంబైకి విజయాన్నందించింది.
శుభ్మన్ గిల్ విఫలమైనా..
229 పరుగుల భారీ లక్ష్యచేధనలో గుజరాత్ టైటాన్స్కు శుభారంభం దక్కలేదు. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే శుభ్మన్ గిల్(1)ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కుశాల్ మెండీస్ రాగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. ఆ వెంటనే కుశాల్ మెండీస్(20) హిట్ వికెట్గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
చెలరేగిన సాయి సుదర్శన్..
క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ రాగా.. సాయి సుదర్శన్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో అతను 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సాయి సుదర్శన్కు అండగా వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతమైన షాట్స్ ఆడాడు. దాంతో గుజరాత్ స్కోర్ బోర్డు పరుగెత్తగా.. ముంబై ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ వరుసగా రెండు సిక్స్లు బాదగా.. డగౌట్లో రోహిత్ శర్మ నెత్తికి చేతులు పెట్టుకున్నాడు.
మలుపు తిప్పిన బుమ్రా..
హాఫ్ సెంచరీకి చేరువైన సుందర్ను బుమ్రా స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ సాయి సుదర్శన్ను గ్లీసన్ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా ఓ భారీ సిక్సర్ బాది ఆశలు రేకెత్తించగా.. రూథర్ ఫోర్డ్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. 19వ ఓవర్లో షారూఖ్ ఖాన్ సిక్సర్ బాదడంతో ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 24 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ను గ్లిసన్, అశ్వని కుమార్ కట్టడిగా వేయడంతో ముంబై విజయం లాంఛనమైంది.