సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా చారిత్రాత్మక విజయంతో ముగించింది. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఈ సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది.

బ్యాటింగ్కు కష్టంగా ఉన్న పిచ్పై యశస్వి జైస్వాల్(23 బంతుల్లో 6 ఫోర్లతో 28), రోహిత్ శర్మ(22 బంతుల్లో 2 ఫోర్లతో 17 నాటౌట్), శుభ్మన్ గిల్(11 బంతుల్లో 2 ఫోర్లతో 10), విరాట్ కోహ్లీ(11 బంతుల్లో 2 ఫోర్లతో 12), శ్రేయస్ అయ్యర్(4 నాటౌట్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా, నండ్రే బర్గర్, మార్కో జాన్సెన్ తలో వికెట్ తీసారు.

పేస్కు అనుకూలంగా ఉన్న ఈ పిచ్పై బౌలర్లు చెలరేగగా.. బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. దాంతో ఈ మ్యాచ్ ఒకటిన్నర రోజులోనే ముగిసిపోయింది. అతి తక్కువ బంతుల్లో(107 ఓవర్లు) ఫలితం తేలిన మ్యాచ్గా చరిత్రకెక్కింది. కేప్టౌన్ వేదికగా టీమిండియాకు ఇదే తొలి విజయం.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా... జస్ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు.
అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు కుప్పకూలింది. ఓ దశలో 153/4 స్కోర్తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది.
భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 46), శుభ్మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39)మాత్రమే రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడా(3/38), లుంగి ఎంగిడి(3/30), నండ్రే బర్గర్(3/42) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 36.5 ఓవర్లలో 176 పరుగులకు కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(6/61) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.
ఎయిడెన్ మార్క్రమ్(103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106) సెంచరీతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు.
98 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మార్క్రమ్ సెంచరీతో 78 పరుగులు మాత్రమే అదనంగా చేసింది. దాంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. పూర్తిగా పేస్కు అనుకూలించే పిచ్ను రెడీ చేసి సౌతాఫ్రికా మూల్యం చెల్లించుకుంది.