బుమ్రా గాయం.. బీసీసీఐ సీఓఈపై విమర్శలు!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ)పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక పర్యటనకు చివరి నిమిషంలో బుమ్రా దూరమవడంతో సీఓఈ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత బుమ్రా భారత్ తరఫున ఆడింది రెండు వన్డేలు మాత్రమే.
ఐపీఎల్లో గాయపడటంతో అఫ్గాన్తో ఏకైక టెస్ట్తో పాటు ఇంగ్లండ్, ఐర్లాండ్తో టీ20 సిరీస్లకు బుమ్రా దూరంగా ఉన్నాడు. బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో రిహాబిలిటేషన్ తీసుకొని ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. కానీ రెండు మ్యాచ్లు ఆడి మళ్లీ గాయపడ్డాడు. శ్రీలంక పర్యటనకు అందుబాటులోకి వస్తాడని సీఓఈ ప్రతినిధులు చెప్పడంతో సెలెక్టర్లు శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు.

సీఓఈ ఏం చేస్తోంది..?
బుమ్రా ఫిట్నెస్ సాధించినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, సీరిస్ మొత్తానికి దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. దాంతో సీఓఈ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆటగాళ్ల రికవరీ కోసం సీఓఈలో బీసీసీఐ అత్యున్నత స్థాయి వైద్యులు, ఫిజియోలు, సాంకేతికతతో పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేసింది. కానీ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన వ్యవస్థ బుమ్రా కోలుకునే ప్రక్రియలో ఎంతమేర తోడ్పడింది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అసలు అతని ఫిట్నెస్ను అంచనా వేయడంలో సీఓఈ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సీఓఈకి సెలెక్టర్ల మధ్య సరైన సమన్వయం లేదనే విషయం తెలుస్తోంది. బుమ్రా ఇలా వచ్చి అలా గాయపడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అతను ఇలానే రీఎంట్రీ ఇచ్చి అంతలోనే గాయపడ్డాడు. అప్పటి నుంచి అతని వర్క్లోడ్ మేనేజ్మెంట్ను టీమిండియా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది.
నితీష్ రెడ్డికి ఎవరు అనుమతి ఇచ్చారు..?
సీఓఈ ఆటగాళ్ల ఫిట్నెస్ను మెరుగుపర్చడంలో, గాయాల నుంచి కోలుకునే ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించడంలో విఫలమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిక బరువుతో ఉన్న హర్షిత్ రాణాకు ఫిట్నెస్ క్లియరెన్స్ ఎలా ఇచ్చారు? అధిక బరువు కారణంగా అతని మరోసారి కండరాల గాయమైందా? వాషింగ్టన్ సుందర్ కండరాల గాయంతో బాధపడుతున్న విషయాన్ని వైద్య బృందం గమనించలేదా?
నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వేగాన్ని పెంచుకోవడానికి ప్రైవేట్ ట్రైనర్ స్టీఫెన్ జోన్స్తో శిక్షణ పొందేందుకు ఎవరు అనుమతించారు? పేస్ వేగాన్ని పెంచే క్రమంలో అతని కండరాల గాయం అయిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఓఈని కూడా ప్రక్షాళన చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్పై కూడా విమర్శలు వస్తున్నాయి. బీసీసీఐ రివ్యూ మీటింగ్లో ఈ అంశాలన్ని చర్చకు వచ్చే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


