ముంబై: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నాడు. మంగళవారం వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్న బుమ్రా.. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సూచించాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, పుజారా, రహానే తదితరులు వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు.
ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో వీళ్లంతా బీసీసీఐ సూచనల మేరకు కోవిషీల్డ్ టీకా తీసుకున్నారు. సెకండ్ డోస్కు ఇబ్బంది తలెత్తకుండా యూఏఈలో లభించే కోవిషీల్డ్నే తీసుకోవాలని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది.
Vaccinated. Please stay safe everyone. pic.twitter.com/8ZrclDh2LI
— Jasprit Bumrah (@Jaspritbumrah93) May 11, 2021
గత మంగళవారం ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో ఆటగాళ్లంతా ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. దాంతో తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్లకు భారత ఆటగాళ్లు క్యూ కట్టారు. గత గురువారం శిఖర్ ధావన్ వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టగా.. టీమిండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే శనివారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. 32 ఏళ్ల జింక్స్ తన సతీమణి రాధికతో కలిసి ముంబైలోని వ్యాక్సిన్ కేంద్రంలో కరోనా మొదటి డోసు వేయించుకున్నాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం ముంబైలో కరోనా ఫస్ట్ డోస్ టీకా వేయించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.. టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా కూడా తొలి డోస్ వేసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. అందరూ జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.