
పుణే: ఐపీఎల్ 2022 సీజన్లో పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నాయని ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. టాస్ కూడా కీలకం అవుతుందని, ఈ పరిస్థితుల్లో వికెట్లు తీయడం బౌలర్లకు కష్టంగా ఉందని చెప్పాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఈ ఏడాది పిచ్లు బ్యాటర్లకు సహకరిస్తున్నాయి. వికెట్లు తీయడం కష్టంగా ఉంది. డ్యూ ప్రభావం కారణంగా టాస్ కూడా కీలకం అవుతుంది. కానీ బౌలర్లుగా మన ప్రయత్నాలు మనం చేయాలి. కొత్త బంతిని మంచి లెంగ్త్లో వేస్తూ స్వింగ్ చేస్తే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. టాస్ గెలవడం కూడా ముఖ్యం. అప్పుడు కచ్చితంగా మనకు ఎంతో కొంత పైచేయి ఉంటుంది. ప్రతి క్రికెటరూ దీన్ని అర్ధం చేసుకోవాలి. అన్ని జట్లూ ఈ దశను దాటుకు వెళ్లాలి.
ముంబై ఇండియన్స్ కూడా ఇలాంటి స్థితిలోనే ఉంది. ప్రస్తుతం ముంబై టీమ్ దాదాపు కొత్త జట్టుగా చెప్పుకోవచ్చు. ఫార్మాట్ను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. ఒత్తిడిని అధిగమించి ఎలా గెలవాలో నేర్చుకోవాలి. కొత్త కుర్రాళ్లు గ్రహించాల్సింది ఇదే. ఇప్పటిదాకా మేం అనుకున్నది ఏది అనుకున్నట్లు జరగలేదు. మా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవ లేదు. బలంగా పుంజుకుంటామని ఆశిస్తున్నా. ఇందుకోసం పోరాడాల్సి ఉంది'అని బుమ్రా పేర్కొన్నాడు.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసింది. బలహీనమైన బౌలింగ్ ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. జస్ప్రీత్ బుమ్రాకు సరైన తోడు లేకపోవడంతో బౌలింగ్ విభాగం విఫలమవుతోంది. ఈ పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్తో నేడు జరిగే మ్యాచ్లో విజయమే లక్ష్యంగా ముంబై సిద్దమవుతోంది. తుది జట్టులో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. ఫాబియన్ అలెన్ జట్టులోకి రానున్నాడు.