టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో 47 ఏళ్ల రికార్డ్ను బుమ్రా అధిగమించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లు తీయడం ద్వారా బుమ్రా ఈ ఫీట్ సాధించాడు.
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీయడం ద్వారా బుమ్రా ఈ ఘనతను అందుకున్నాడు. రెండో రోజు ఆట ఆరంభంలో మార్నస్ లబుషేన్ వికెట్ తీసి తన ఖాతాలో 32 వికెట్లు వేసుకున్నాడు. 1977-78లో ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల సిరీస్లో భారత మాజీ బౌలర్ బిషన్ సింగ్ బేడీ 31 వికెట్లు తీసాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డ్గా ఉండగా.. తాజాగా బుమ్రా 32 వికెట్లు తీసి అధిగమించాడు. తొలి రోజు ఆటలో ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన బుమ్రా.. రెండో రోజు లబుషేన్ను ఔట్ చేశాడు.

అనంతరం గాయంతో మైదానాన్ని వీడాడు. లేకుంటే బుమ్రా మరిన్ని వికెట్లు తీసేవాడు. 9/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్స్టర్(105 బంతుల్లో 5 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్(57 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/51), ప్రసిధ్ కృష్ణ(3/42)లతో పాటు జస్ప్రీత్ బుమ్రా(2/33), నితీష్ కుమార్ రెడ్డి(2/32) రెండేసి వికెట్లు పడగొట్టారు. గాయంతో బుమ్రా మధ్యలోనే వెనుదిరిగినా.. సిరాజ్, ప్రసిధ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
4 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 129 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత్ ఆ పరుగులు చేయగలిగింది. క్రీజులో జడేజా(2 బ్యాటింగ్)తో పాటు వాషింగ్టన్ సుందర్(4 బ్యాటింగ్) ఉన్నాడు.
ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే.. ఆసీస్ ముందు 250 ప్లస్ టార్గెట్ పెట్టాలి. భారత్ మరో 120 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా, సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడితేనే ఇది సాధ్యమవుతోంది.