హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కెప్టెన్గా తొలి టీ20 మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి భారత ప్లేయర్గా రికార్డుకెక్కాడు. 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన బుమ్రా(2/24) తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
ఐర్లాండ్తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో తన ఫస్ట్ ఓవర్లోనే రెండు వికెట్లు తీసి బౌలింగ్ పవర్ ఏంటో చూపించాడు. అతనితో పాటు ఇతర బౌలర్లు చెలరేగడంతో ఐర్లాండ్ తక్కువ స్కోర్కే పరిమితమవ్వగా.. టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్దతిన 2 పరుగుల తేడాతో గెలుపొందింది. అసాధారణ బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

దాంతో బుమ్రాకు అరుదైన ఘనత దక్కింది. టీ20ల్లో భారత్కు సారథ్యం వహించిన 11వ ప్లేయర్ బుమ్రా. కెప్టెన్గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి భారత ఆటగాడిగా అతను చరిత్రకెక్కాడు.
బుమ్రా కన్నా ముందు వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు టీ20ల్లో భారత జట్టుకు సారథ్యం వహించారు. కానీ వీరిలో ఒక్కరు కూడా కెప్టెన్గా తమ తొలి మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోలేదు.
ఈ రికార్డే కాకుండా బుమ్రా మరో ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు. 65 టీ20ల్లో అశ్విన్ 72 వికెట్లు తీయగా.. బుమ్రా 61 టీ20ల్లో ఈ ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. బారీ మెక్కార్తీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కర్టీస్ కాంఫెర్(39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ దశలో 100 పరుగుల లోపే ఆలౌటయ్యేలా కనిపించిన ఐర్లాండ్ను ఈ ఇద్దరూ అసాధారణ బ్యాటింగ్తో ఆదుకున్నారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/24), ప్రసిధ్ కృష్ణ(2/32), రవి బిష్ణోయ్(2/23) రెండేసి వికెట్లతో సత్తా చాటగా... అర్ష్దీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు చేయగా వర్షం అంతరాయం కలిగించింది. ఎంతకు వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చారు.
భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(0) విఫలమైనా.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), రుతురాజ్ గైక్వాడ్(19 నాటౌట్) రాణించారు.