
పార్ల్: టెస్ట్ సిరీస్లో గాయపడిన టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఫిట్నెస్పై టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా క్లారిటీ ఇచ్చాడు. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమవడంతో వన్డే సిరీస్లో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్న విషయం తెలిసిందే. అతనికి డిప్యూటీగా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన జస్ప్రీత్ బుమ్రాను సిరాజ్ ఫిట్నెస్పై ప్రశ్నించగా.. అతను కోలుకున్నాడని చెప్పాడు.
'నాకు తెలిసి సిరాజ్ ఫిట్గానే ఉన్నాడు. మాతో కలిసి అతను ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో సిరాజ్ అసౌకర్యానికి గురవుతున్నట్లు నాకేమీ కనిపించలేదు. వన్డే జట్టులో అందరూ ఫిట్గానే ఉన్నారు'' అని వెల్లడించాడు.
భారత్- సౌతాఫ్రికాతో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి పార్ల్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. కెప్టెన్ రాహుల్ నేతృత్వంలో విజయమే లక్ష్యంగా సిద్దమవుతోంది.
సౌతాఫ్రికాతో జొహనెస్బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తుండగా.. అతని తొడ కండరాలు పట్టేశాయి. దాంతో.. చాలా సేపు మైదానం వెలుపల ఉన్న సిరాజ్.. ఫిజియో చికిత్స అనంతరం మళ్లీ బౌలింగ్కి వచ్చాడు. కానీ.. మునుపటి తరహాలో వేగంగా బంతుల్ని విసరలేకపోయాడు. ఆ తర్వాత కేప్టౌన్లో మూడో టెస్టుకి అతను ఫిట్నెస్ సాధించలేకపోవడంతో ఉమేశ్ యాదవ్ని సిరాజ్ స్థానంలో టీమిండియా మేనేజ్మెంట్ ఆడించింది. వన్డే జట్టులోకి ఎంపికైన మహ్మద్ సిరాజ్ ఫిట్నెస్పై క్లారిటీ రాకపోవడంతో ఇటీవల అతనికి బ్యాకప్గా నవదీప్ సైనీని భారత సెలెక్టర్లు ఎంపికచేశారు. అయితే సిరాజ్కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.