
ముంబై: కరోనా వైరస్ కారణంగా క్రీడా టోర్నీలన్నీ వాయిదాపడ్డాయి. ఆఖరికి ఒలింపిక్స్ కూడా వచ్చే ఏడాది జరగనున్నాయి. పైగా ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ విధించారు. దీంతో భారత క్రికెటర్లంతా ఇంటి పట్టునే ఉంటున్నారు.
ఈ ఊహించని విరామాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. ఇక తమ క్వారంటైన్ సమయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నామో ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఫన్నీ వీడియోలతో అభిమానులను అలరిస్తుండగా.. అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు.
తాజాగా టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంటిని శుభ్రం చేస్తూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇంటిని శుభ్రం చేయడమే శారీరక కసరత్తులని, దీంతో తన తల్లి ఎంతో సంతోషిస్తుందని వీడియోకి వ్యాఖ్య జత చేశాడు. అయితే వీడియోలో బుమ్రా చెప్పులతో ఇంటిని శుభ్రం చేశాడు. దీంతో నెటిజన్ల ట్రోల్స్ చేస్తారని ముందే ఊహించి చెప్పులు లేకుండా రెండోసారి కూడా శుభ్రం చేశానని తెలిపాడు. భారత్ తరఫున బుమ్రా 14 టెస్టులు, 64 వన్డేలు, 49 టీ20లు ఆడాడు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న బుమ్రా..అనతి కాలంలోనే స్టార్ పేసర్గా ఎదిగాడు.