|
పేలవ ప్రదర్శనతో..
అప్పటికే ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగి వ్యూహాత్మకంగా తప్పటడుగు వేసిన టీమిండియా.. బుమ్రా పేలవ ప్రదర్శనతో పూర్తిగా బలహీనమైంది. ఇతర పేసర్లు మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మలపై తీవ్ర ఒత్తిడి పడింది. దాంతో ఈ ఇద్దరు కూడా తేలిపోయారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి చెరో ఏడు వికెట్లు తీశారు. దాంతో కీలక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కనీస పోరాటపటిమ కనబర్చలేకపోయింది. ఇక భారత వైఫల్యానికి ప్రధాన కారణం బుమ్రానే అని భావించిన అభిమానులు అతనిపై పీకల్దాక కోపం పెంచుకున్నారు.
|
సతీమణితో ఫొటో..
ఈ క్రమంలోనే తాజాగా తన సతీమణితో దిగిన ఫొటోను బుమ్రా షేర్ చేయడం వారికి పుండు మీద కారం చల్లినట్లయింది. దాంతో అభిమానులు ట్రోల్స్, మీమ్స్తో రెచ్చిపోయారు. కొన్ని రోజులు ఫోటోలు షేర్ చేయకుండా గదిలో పండుకోమని ఒకరంటే.. పెళ్లాంతో ఫొటోలు షేర్ చేసేందుకు సిగ్గుండాలి బుమ్రా? అని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు. అంతేకాకుండా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా బుమ్రా కారణంగానే భారత్ ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. అతన్ని అనవసరంగా ఆడించారని, బుమ్రా పనైపోయిందని మండిపడుతున్నారు.
|
పెళ్లయింది జోష్ పోయింది..
ఇంకొందరైతే బుమ్రా సతీమణిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్కు దిగుతున్నారు. 'పెళ్లైన నాటి నుంచి ఫోటోల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నావు.. నీలో మునపటి జోష్ లేదు.. బుమ్రా ఫోటోలు కాదు ముందు వికెట్లు తీయ్.. బుమ్రా భయ్యా వికెట్ ఎప్పుడు తీస్తావు? ముంబై ఇండియన్స్ తరపున రెచ్చిపోయి బౌలింగ్ చేస్తావు.. మరి టీమిండియాకు వచ్చేసరికి ఎందుకిలా చేస్తున్నావు.? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ముగియడంతో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు సిద్ధమవుతుంది. ఆగస్టు 4 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది.
|
ఇట్స్ ఫ్యామిలీ టైమ్..
ఆ టెస్ట్ సిరీస్కు ఇంకా ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు టీమిండియా క్రికెటర్లకు విరామం ఇచ్చారు. బుడగ నుంచి బయటకు వెళ్లి గడిపేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆటగాళ్లంతా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రా తన సతీమణితో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకొని వారి ఆగ్రహానికి గురయ్యాడు.