సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్లో టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది.
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అసాధారణ బ్యాటింగ్తో భారత ఓటమిని శాసించాడు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై అద్భుతమైన డిఫెన్స్తో బవుమా హాఫ్ సెంచరీ సాధించాడు. కార్బిన్ బోష్తో కలిసి 8వ వికెట్కు 44 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ పార్ట్నర్షిప్ టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.
అయితే ఈ పరాజయం అనంతరం భారత రెండో ఇన్నింగ్స్లో నాన్స్ట్రైకర్గా అజేయంగా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా నేరుగా టెంబా బవుమా దగ్గరకు వెళ్లిన క్షమాపణలు చెప్పాడు. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని వివరణ ఇస్తూ కనిపించాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో బవుమా బ్యాటింగ్ చేసే సమయంలో బుమ్రా, రిషభ్ పంత్ మధ్య రివ్యూ కోసం జరిగిన సంభాషణ స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యింది. బవుమా ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూ తీసుకోవాలా? వద్దా? అనే చర్చలో బవుమా మరుగుజ్జు అంటూ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

పంత్ కూడా అతను పొట్టోడే అయినా బంతి వికెట్ల కంటే ఎత్తులో వెళ్లిందని వివరించాడు. ఈ ఇద్దరూ ఉద్దేశపూర్వకంగా అనకపోయినా.. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయితే ఈ కామెంట్స్ను బవుమా.. సౌతాఫ్రికా టీమ్ సీరియస్గా తీసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వినిపించాయి. 'మరుగుజ్జు అన్నారు.. మట్టికరిపించాడు.'అని భారత అభిమానులు కూడా టీమిండియా ఓటమి నేపథ్యంలో ట్రోలింగ్కు దిగారు.
ఏది ఏమైనా వివాదరహితుడైన జస్ప్రీత్ బుమ్రా.. తొలిసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఉద్దేశపూర్వకంగా అనకపోయినా.. క్షమాపణలు చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నాడు. క్షమాపణలు చెప్పిన బుమ్రాపై అతని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన తప్పు లేకపోయినా.. బుమ్రా క్షమాపణలు కోరి మనసులు గెలుచుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.