వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్లో శుభారంభం చేసిన భారత్.. ఆఖరి పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఏకపక్షంగా సాగిన తొలి టెస్ట్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్.. ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్కు వెస్టిండీస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. మరోవైపు వెస్టిండీస్ బౌలర్లను భారత బ్యాటర్లు చితక్కొట్టారు. ఆఖరి టెస్ట్లోనూ ఇదే జోరును కొనసాగించి సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
అయితే ఈ మ్యాచ్కు టీమిండియా కాంబినేషన్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి ప్రసిధ్ కృష్ణకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలోని వన్డే సిరీస్కు ఎంపికైన ప్రసిధ్ కృష్ణకు గేమ్ టైమ్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ సిరాజ్కు రెస్ట్ ఇవ్వాలనుకుంటే బుమ్రా జట్టులో కొనసాగుతాడు. వెస్టిండీస్తో తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లో వికెట్లు సాధించలేకపోయాడు.

మరోవైపు ఢిల్లీలోని అరుణ్జైట్లీ క్రికెట్ స్టేడియం స్పిన్కు అనుకూలంగా ఉండనుంది. ఈ క్రమంలోనే టీమిండియా ఎక్స్ట్రా స్పిన్ ఆల్రౌండర్తో బరిలోకి దిగనుంది. పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టెస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ దక్కలేదు. అయితే అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
తొలి టెస్ట్లో విఫలమైన సాయి సుదర్శన్ను తప్పించి దేవదత్ పడిక్కల్కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. అయితే ఒకే ఇన్నింగ్స్ వైఫల్యానికి సాయి సుదర్శన్ను పక్కనపెడుతారా? అంటే అవుననే కచ్చితంగా చెప్పలేం. మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.
యశస్వి జైస్వల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్