టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, మహిళా కామెంటేటర్ ఇసా గుహ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో బుమ్రా ఐదు వికెట్లతో సత్తా చాటిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇసా గుహా.. జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనను కొనియాడుతూ.. జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. కోతి జాతికి చెందిన జంతువుతో బుమ్రాను పోల్చింది. దాంతో ఆమెపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండో రోజు ఆట ఆరంభంలో బుమ్రా.. ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీనీని ఔట్ చేశాడు.

దాంతో ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ.. బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'బుమ్రా ఈ రోజు ఐదు ఓవర్లలో 4 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసాడు. ఇది కదా మాజీ కెప్టెన్ నుంచి జట్టు ఆశించేది'అని కొనియాడాడు.
అతని వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా.. ఇసా గుహ సైతం బుమ్రాను కొనియాడుతూ.. నోరు జారింది. బుమ్రాను ప్రైమట్ అనే పదంతో పోల్చింది. 'అద్భుతం.. బుమ్రా MVP. మోస్ట్ వాల్యూబుల్ ప్రైమేట్ జస్ప్రీత్ బుమ్రా'అని పేర్కొంది. అయితే ప్రైమేట్ అంటే కోతి జాతికి చెందిన జంతువు. బుమ్రాను కోతితో పోల్చడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసా గుహ తాజా వ్యాఖ్యలు 2008లో చోటు చేసుకున్న వివాదాస్పద మంకీ గేట్ ఘటనను గుర్తు చేసింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దివంగత ఆండ్రూ సైమండ్స్ను హర్భజన్ సింగ్.. మంకీ అన్నడానే ఆరోపణలతో వివాదం చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్పై ఆసీస్ పట్టు బిగించింది. 28/0 ఓవర్నైట్ స్కోర్తో బరిలోకి దిగిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 101 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(160 బంతుల్లో 18 ఫోర్లతో 152), స్టీవ్ స్మిత్ (190 బంతుల్లో 12 ఫోర్లతో 101) విధ్వంసకర శతకాలతో చెలరేగారు. స్మిత్-హెడ్ నాలుగో వికెట్కు 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/72) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు.