న్యూఢిల్లీ: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో తెగతెంపులు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన కోల్కతా నైట్రైడర్స్కు చెందిన లాస్ ఏంజిల్స్ నైట్రైడర్స్తో రెండేళ్లకు గాను రూ. 36.8 కోట్ల రూపాయాలకు జాసన్ రాయ్ డీల్ చేసుకున్నట్లు ఇంగ్లీష్ మీడియా పేర్కొంది.
అమెరికా వేదికగా జూలై 13 నుంచి జూలై 30 వరకు మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ జరగనుంది. ఐపీఎల్కు చెందిన ఫ్రాంచైజీలే ఈ టోర్నీలో భాగమయ్యాయి. ఈ టోర్నీ ఆడేందుకే జాసన్ రాయ్.. లాంస్ ఏంజిల్స్ నైట్రైడర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడని డెయిలీ మెయిల్ వెబ్సైట్ పేర్కొంది. ఇదే నిజమైతే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్కు జాసన్ రాయ్ దూరంగా ఉండనున్నాడు.

సొంతగడ్డపై జరిగిన 2019 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో జాసన్ రాయ్ కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచ్ల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడ్డ అతను ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్తో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. డెయిలీ మెయిల్ కథనం ప్రకారం జాసన్ రాయ్ ఇప్పటికే తన కాంట్రాక్టు రద్దు విషయంపై ఈసీబీ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో తన కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంటేనే జాసన్ రాయ్కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లభించనుంది. అదే జరిగితే జాసన్ రాయ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే.
9 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో.. ఇంగ్లండ్ తరఫున ఇప్పటివరకు 116 వన్డే మ్యాచ్లు ఆడిన జాసన్ రాయ్.. 39.92 సగటుతో 4271 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కేకేఆర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న జాసన్ రాయ్.. ఈ సీజన్లో పర్వాలేదనిపించాడు. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ కోసం జాసన్ రాయ్తో పాటు మరో ఐదుగురు ఆటగాళ్లతో ఫ్రాంచైజీలు ఒప్పందం చేసుకున్నాయని గతంలోనే వార్తలు వచ్చాయి.