లండన్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో తాను తెగ తెంపులు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై ఆ జట్టు స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ స్పందించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇంగ్లండ్ టీమ్ తరఫున ఆడటాన్ని వదులుకోనని తెలిపాడు. ఇంగ్లండ్ టీమ్ తరఫున ఆడేందుకు తాను అధిక ప్రాధానత్య ఇస్తానని స్పష్టం చేశాడు.
చాలా ఏళ్ల పాటు ఇంగ్లండ్ టీమ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అమెరికా వేదికగా జూలై 13 నుంచి జూలై 30 వరకు జరిగే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ కోసం జాసన్ రాయల్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ను వదులుకుంటున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

కోల్కతా నైట్రైడర్స్కు చెందిన లాస్ ఏంజిల్స్ నైట్రైడర్స్తో రెండేళ్లకు గాను రూ. 36.8 కోట్ల రూపాయాలకు జాసన్ రాయ్ ఒప్పందం కుదుర్చుకున్నాడని డెయిలీ మెయిల్ వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురిచింది. అయితే ఈ వార్తలపై జాసన్ రాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ను స్టోరీగా షేర్ చేశాడు.
'గత 24 గంటలుగా నా గురించి అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. వీటిపై నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఇంగ్లండ్ క్రికెట్ను ఎప్పుడూ నేను వదిలి వెళ్లను. ప్రొఫెషనల్ క్రికెటర్గా నేను నా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తాను. చాలా కాలం పాటు ఇంగ్లండ్ తరఫున ఆడాలని ఆశిస్తున్నా. నా టాప్ ప్రియారిటీ కూడా ఇదే.
మెజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే విషయంపై ఈసీబీతో ఇప్పటికే చర్చలు జరిపాను. ఈ లీగ్ ఆడేందుకు ఈసీబీ నాకు అనుమతించడంతో పాటు సంతోషం కూడా వ్యక్తం చేసింది. సింగిల్ ఫార్మాట్ ప్లేయర్కు సెంట్రెల్ కాంట్రాక్ట్ అవసరం లేదు. ఇంగ్లండ్ షెడ్యూల్తో క్లాష్ లేనందున మేజర్ లీగ్ టోర్నీలో ఆడటాన్ని ఓ అవకాశంగా భావిస్తున్నా.
ఈ టోర్నీ ఆడటం క్రికెటర్గా నాకు చాలా ఉపయోగపడుతుంది. అందరికి మరోసారి చెబుతున్నా.. ఇంగ్లండ్ టీమ్ తరఫున ఆడటమే నా తొలి ప్రాధాన్యత. ముఖ్యంగా వరల్డ్ కప్ జరగనున్న ఈ ఏడాది దేశం తరఫున ఆడటాన్ని నేను గౌరవంగా భావిస్తా.'అని జాసన్ రాయ్ స్పష్టం చేశాడు.