ఐసీసీ కొత్త రూల్స్:
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త రూల్స్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బంతిపై ఉమ్మి రుద్దకూడదు, మైదానంలో ఆటగాళ్లు షేక్హ్యాండ్స్ ఇచ్చుకోకూడదు. భౌతిక దూరం కచ్చితంగా పాటించాల్సిందే. అలానే వికెట్ పడిన సమయంలో హైఫైని కూడా నిషేధించింది. ఆటగాళ్లకి పాత అలవాట్లని దూరం చేసేందుకు ఇంగ్లండ్, వెస్టిండీస్ కోచ్లు ప్రాక్టీస్ సెషన్, వార్మప్ మ్యాచ్లను కూడా నిర్వహించారు. కానీ టాస్ సమయంలో వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ పొరపాటుగా షేక్హ్యాండ్ ఇవ్వబోయాడు.

షేక్హ్యాండ్ ఇవ్వబోయిన హోల్డర్:
ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్టు ముందు తొలుత చిరుజల్లులు కురవడంతో టాస్ ఆలస్యమైంది. వర్షం తెరిపినివ్వడంతో రెండు గంటల తర్వాత టాస్ వేశారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కాయిన్ ఫ్లిప్ చేయగా.. హోల్డర్ చాయిస్ తీసుకున్నాడు. మ్యాచ్ రిఫరీ స్టోక్స్ టాస్ గెలిచినట్లు ప్రకటించాడు. దాంతో స్టోక్స్ని అభినందించేందుకు హోల్డర్ షేక్హ్యాండ్ ఇవ్వబోయాడు. ఐసీసీ రూల్స్ గుర్తుపెట్టుకున్న స్టోక్స్ అలెర్ట్ అయి షేక్హ్యాండ్ ఇవ్వకుండా బమ్స్ ఇచ్చాడు. ఆపై పగలబడి నవ్వుకున్నాడు. మరోవైపు పక్కనే మ్యాచ్ రిఫరీ కూడా నవ్వులు పూయించాడు.

క్వారంటైన్ మూడ్లోనే ఉన్నావా?:
వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ పొరపాటుగా షేక్హ్యాండ్ ఇవ్వబోయిన వీడియోను 'స్కై స్పోర్ట్స్ క్రికెట్' తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'చేతులను శుభ్రపరుచుకో బెన్ స్టోక్స్' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రికెట్ ఫాన్స్ తమదైన కామెంట్లతో హోల్డర్పై సెటైర్లు వేస్తున్నారు. 'జేసన్ హోల్డర్.. ఇంకా క్వారంటైన్ మూడ్లోనే ఉన్నావా?' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'ఐసీసీ కొత్త రూల్స్ మర్చిపోయావా హోల్డర్' అని మరొకరు ట్వీట్ చేశారు.

వరణుడు అడ్డు:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ పరుగుల ఖాతా తెరవకముందే డొమినిక్ సిబ్లీ (0; 4 బంతుల్లో) వికెట్ చేజార్చుకుంది. పేసర్ షెనాన్ గాబ్రియెల్ అతడిని క్లీన్బౌల్డ్ చేశాడు. మూడు ఓవర్లకు ఇంగ్లాండ్ 1/1తో ఉండగా.. మళ్లీ వర్షం కురిసింది. కాస్త విరామం ఇచ్చిన తర్వాత మళ్లీ ఏడు బంతులు పడ్డాయో లేదో జల్లులు మొదలయ్యాయి.కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. టీ విరామానికి ముందుగానే వెళ్లినా.. వెలుతురు మందగించడానికి తోడు మైదానం చిత్తడిగా మారడంతో తొలి రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

రెండో రోజు కూడా వర్ష సూచన:
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (55 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు గురువారం కూడా వర్ష సూచన ఉంది.


Click it and Unblock the Notifications

ఐసీసీ బలపడాలంటే చైర్మన్ పదవిలో గంగూలీ ఉండాలి: అరుణ్ ధుమాల్










