
సిడ్నీ : టీమిండియా పేస్ దళం, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత భారత పేస్ విభాగం ప్రపచంలోనే మేటిగా ఉందని కొనియాడాడు. త్వరలో భారత్ ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిలెస్పీ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడాడు. ఈ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మలతో భారత పేస్ విభాగం బలంగా ఉందని, ఈ పేస్ త్రయం అత్యుత్తమంగా రాణిస్తుందని జోస్యం చెప్పాడు. అయితే వీళ్ల కన్నా ముందు ఆడిన భారత పేసర్లను తను కించపర్చడం లేదని కూడా గిలెస్పీ స్పష్టం చేశాడు.
'జస్ప్రీత్ బుమ్రా కెరీర్ ముగిసేలోపు సూపర్స్టార్ అవుతాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియా ఆల్టైమ్ అత్యుత్తమ పేసర్గా నిలుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక మహ్మద్ షమీ విషయానికొస్తే అతనో అద్భుతమైన బౌలర్. ఇషాంత్ శర్మ కూడా ఎంత ముఖ్యమైన ఆటగాడో నిరూపించుకున్నాడు. అతని కెరీర్లో ఎత్తుపల్లాలు ఉన్నా.. తన విలువేంటో తెలియజేశాడు. నిత్యం తనని తాను మెరుగుపర్చుకుంటున్నాడు. ఆ విషయంలో టీమిండియా గర్వపడాలి. ఇక భువి, ఉమేశ్ యాదవ్ సైతం అద్భుతమైన పేసర్లే. ఒకప్పుడు జవగళ్ శ్రీనాథ్ టీమిండియాలో మెరిసాడు. ఆపై జహీర్ ఖాన్ భారత పేస్కు వన్నె తెచ్చాడు. వాళ్లతో వీళ్లని పోల్చడం కష్టమే అయినా.. బౌలింగ్ యూనిట్లో మాత్రం బలం పెరిగింది.' అని గిలెస్పీ చెప్పుకొచ్చాడు.

ఆసీస్లో గురువారమే అడుగుపెట్టిన భారత ఆటగాళ్లంతా సిడ్నీలో క్వారంటైన్లో ఉన్నారు. అక్కడే ప్రాక్టీస్ చేస్తూ సుదీర్ఘ పర్యటనకు సమాయత్తమవుతున్నారు. ఇక గత సీజన్లో ఇక్కడ పర్యటించిన భారత్.. ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో తొలిసారి టెస్టు సిరీస్ గెలుపొంది చరిత్ర సృష్టించింది. కరోనా అనంతరం ఆడుతున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ కూడా ఇదే కావడంతో కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నవంబర్ 27 నుంచి ఈ టూర్ మొదలవ్వనుంది.