లండన్: ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్లో పరుగుల వరద పారుతోంది. టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఇప్పటికే ఓ డబుల్ సెంచరీతో పాటు సెంచరీ బాదాడు. తాజాగా మరో బ్యాటర్ జేమ్స్ బ్రేసీ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
సోమర్సెట్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో గ్లోసెస్టర్షూర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న జేమ్స్ బ్రేసీ 151 బంతుల్లో 30 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 224 రన్స్ చేశారు. అతనితో పాటు క్రిసెడెంట్(65), ఓలివర్ ప్రెస్(77) హాఫ్ సెంచరీలతో రాణించడంతో గ్లోసెస్టర్షైర్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 454 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సోర్సెట్ 38.2 ఓవర్లలో 256 పరుగులకే కుప్పకూలి 198 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది. ఇదే టోర్నీలో డర్హమ్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో పృథ్వీ షా(76 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్లతో 119 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్తో నార్తంప్టన్షైర్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్హమ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు కుప్పకూలింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నార్తంప్టన్ షైర్ 25.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. 68 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న పృథ్వీ షా సూపర్ సిక్స్తో మ్యాచ్ను ముగించడం విశేషం. గత బుధవారం సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో పృథ్వీ షా 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. పృథ్వీ షా ఇన్నింగ్స్లో 28 ఫోర్లు, 11 సిక్స్లతో 39 బౌండరీలు ఉండటం విశేషం.
ఈ డబుల్ సెంచరీతో తన ఫేలవ ఫామ్కు ఫుల్స్టాప్ పెట్టిన 23 ఏళ్ల పృథ్వీ షా అదే జోరును కొనసాగిస్తున్నాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్, అనవసర గొడవలతో ఫేడ్ ఔట్ అయిన పృథ్వీ షా.. మళ్లీ పూర్వ వైభవం అందుకునేందుకు శ్రమిస్తున్నాడు. భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు.