ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. సంప్రదాయ క్రికెట్లో 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పాడు. వెస్టిండీస్తో శుక్రవారం ముగిసిన టెస్ట్ మ్యాచ్తో ఆటకు అల్విదా ప్రకటించాడు. ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లతో సత్తా చాటిన అండర్సన్.. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అండర్సన్కు ఇంగ్లండ్ ఆటగాళ్లు, అభిమానులు అదిరిపోయే రీతిలో వీడ్కోలు పలికారు. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరిగిన అండర్సన్ వీడ్కోలు మ్యాచ్కు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మ్యాచ్ ముగిసిన అనంతరం అభిమానులంతా అండర్సన్కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అండర్సన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా హాజరైన అండర్సన్ కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

అండర్సన్ స్టన్నింగ్ డెలివరీతో వెస్టిండీస్ బ్యాటర్ జాషువ డసిల్వను తన ఆఖరి వికెట్గా ఖాతాలో వేసుకున్నాడు. 41 ఏళ్ల అండర్సన్ తన టెస్ట్ కెరీర్లో 188 మ్యాచ్లు ఆడి 26.45 సగటుతో 704 వికెట్లు పడగొట్టాడు. 2003లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన అండర్సన్.. 2022లో వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 194 వన్డేల్లో 269 వికెట్లు పడగొట్టాడు. 19 టీ20ల్లో 18 వికెట్లు తీసాడు.
టెస్ట్ల్లో సుదీర్ఘ కాలం కొనసాగిన పేసర్గా.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అండర్సన్ నిలిచాడు. ఓవరాల్గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. ముత్తయ్య మురళీ దరణ్(800), షేన్ వార్న్(708) అండర్సన్ కన్నా ముందున్నారు. అండర్సన్ రిటైర్మెంట్ నేపథ్యంలో యావత్ క్రికెట్ ప్రపంచం అతనికి అభినందనలు తెలుపుతోంది.
అండర్సన్ ఆడిన ఈ ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల భారీ తేడాతో గెలిచింది. 79/6 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన వెస్టిండీస్ 136 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 41.4 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. లూయిస్ (27) టాప్ స్కోరర్గా నిలవగా... గస్ అట్కిన్సన్ ఏడు వికెట్లతో సత్తాచాటాడు. అండర్సన్, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 371 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (76), జేమీ స్మిత్ (70), జో రూట్ (68), ఒలీ పోప్ (57), హ్యారీ బ్రూక్ (50) అర్ధశతకాలు సాధించారు. విండీస్ బౌలర్లలో సీల్స్ నాలుగు వికెట్లు, హోల్డర్, మొటియ్ చెరో రెండు వికెట్లు తీశారు.