
ఆ విమానంలో నేను ఉండాలంటే:
తాజాగా జేమ్స్ అండర్సన్ బీబీసీతో మాట్లాడినట్టు పీటీఐ పేర్కొంది. 'వచ్చే యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు వెళ్లే విమానంలో నేను ఉండాలంటే.. నాకు చేతనైంది ఏదైనా చేస్తాను. వికెట్లు తీయాలనే ఆరాటం నాలో ఇంకా అలాగే ఉంది. ఇప్పటికీ ఆడాలనే కసి మిగిలే ఉంది. కాబట్టి మరింత రాణించి ఫిట్గా ఉండడానికి ప్రయత్నిస్తా. రాబోయే కాలంలో మరిన్ని వికెట్లు తీస్తూ ఉంటే కచ్చితంగా నేనా విమానంలో ఉంటాననే నమ్మకం ఉంది' అని అండర్సన్ అన్నాడు.

ఇంకొన్ని రోజులు ఆడతా:
'38 ఏళ్లలో కూడా నేను ఇలా కొనసాగడం నా అదృష్టం. ఆ దేవుడికి ధన్యవాదాలు. నాకు అండగా నిలిచిన నా కుటుంబ సబ్యులకు కృతజ్ఞతలు. ఇనేళ్లుగా ఆడుతున్నానంటే అందుకు నా శారీరక దృఢత్వమే కారణం. నేను జిమ్లోనూ చాలా కష్టపడతా. అందువల్లే నా శరీరంపై అధిక ఒత్తిడి ఉండదనుకుంటా. ఇప్పటికే కొన్ని వేళ్లు వంకర పోయాయి. అయినా దెబ్బలు లేకుండా ఉన్నా కాబట్టి ఇంకొన్ని రోజులు ఆడతాను' అని అండర్సన్ తెలిపాడు.

700 వికెట్లు తీస్తా:
జేమ్స్ అండర్సన్ బుధవారం మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'కెప్టెన్ జో రూట్తో మాట్లాడా. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్ కోసం నేను ఆస్ట్రేలియాలో ఉండాలని అతడు కోరుకుంటున్నాడు. నేను వెళ్లకూడదనడానికి కారణమేమీ కనిపించట్లేదు. నాలో సత్తా ఉందని నేను భావించినంత కాలం ఆడుతూనే ఉంటా. ఇంగ్లండ్ క్రికెటర్గా నా చివరి టెస్టు ఆడేశాననునుకోవట్లేదు. నేను 700 వికెట్ల మైలురాయిని అందుకోగలనా? ఎందుకు అందుకోలేను?' అని పేర్కొన్నాడు.

ఏకైక ఫాస్ట్ బౌలర్:
టెస్టుల్లో 600 వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ జిమ్మీ మాత్రమే. ఇటీవలే పాకిస్థాన్తో ఆడిన చివరి టెస్టులో ఐదో రోజు కెప్టెన్ అజర్ అలీని ఔట్ చేసి ఆ ఘనత సాధించాడు. అంతకుముందు ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అనిల్ కుంబ్లే (619) లాంటి దిగ్గజ స్పిన్నర్లు మాత్రమే అతడికన్నా ఎక్కువ వికెట్లు సాధించారు. 2003లో అరంగేట్రం చేసిన జిమ్మీ ఇప్పటికీ ఇంగ్లడ్లో ప్రధాన పేసర్గా కొనసాగుతున్నాడు. వయసు మీదపడ్డా తన పదునైన బంతులతో ప్రత్యర్థుల వికెట్లు అవలీలగా తీస్తున్నాడు.


Click it and Unblock the Notifications

IPL 2020: ముంబై, కోల్కతాకు ఉపశమనం!!










