
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కోసం అబుదాబిలో బస చేస్తున్న ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు భారీ ఉపశమనం లభించినట్లు సమాచారం తెలుస్తోంది. ముంబై, కోల్కతా జట్లకు ఇకపై ఔట్ డోర్లో సాధన చేసుకునేందుకు అనుమతులు లభించాయట. ఈ రోజు నుండే ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఉంది.
ఈనెల 21న అబుదాబి చేరుకున్న ముంబై, కోల్కతా జట్లు ఇప్పటికే ఆరు రోజుల క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకున్నాయి. అయితే అబుదాబిలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. స్థానిక అధికారులు 14 రోజుల క్వారంటైన్ నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు. దీంతో ఆ రెండు జట్లకూ ఆటంకంగా మారింది. మరో వారం రోజులు క్వారంటైన్లోనే ఉండాల్సి రావడంతో.. వారి ప్రాక్టీస్కు అంతరాయం కలిగింది.
ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముంబై, కోల్కతా జట్లు బీసీసీఐని సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు కరోనా పరీక్షలు చేసుకున్న తమకు ప్రాక్టీస్ చేసుకునే అనుమతులు ఇప్పించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ను కోరాయి. గవర్నింగ్ కౌన్సిల్, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కలిసి స్థానిక అధికారులను సంప్రదించాయి. గురువారం సాయంత్రం జరిగిన ఈ చర్చల్లో అక్కడి అధికారులు ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసుకునే అనుమతులు ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. అనుమతులు లభిస్తే మాత్రం.. ముంబై, కోల్కతా జట్లు కూడా దుబాయ్లో ఉన్న మిగతా జట్ల మాదిరి ప్రాక్టీస్ చేయనున్నాయి. అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లకు ఇప్పటికే పలుమార్లు కరోనా పరీక్షలు జరిపారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మాత్రం కరోనా కలకలం రేపింది. మొత్తం 13 మందికి సోకింది. ఈ విషయంపై చెన్నై అధికారిక ప్రకటన చేయలేదు. ఇక సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానుంది.