హగ్ చేసుకున్న జిమ్మీ:
అందరిచేత మన్ననలు అందుకున్న జేమ్స్ అండర్సన్ తాజాగా సౌతాంప్టన్లో వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో మాత్రం ఐసీసీ నిబంధనలను గాలికొదిలేశాడు. 3వరోజు ఆటలో భాగంగా రోస్టన్ చేజ్ వికెట్ తీసిన ఆనందంలో కనీస భౌతిక దూరం పాటించకుండా సహచరుల వద్దకు వెళ్లి హగ్ చేసుకున్నాడు. అండర్సన్ వేసిన బంతి చేజ్ మొకాళ్లకు తాకుతూ వెళ్లింది. దాంతో అండర్సన్ ఎల్బీ అప్పీల్కు వెళ్లగా అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. దీంతో కెప్టెన్ స్టోక్స్ డీఆర్ఎస్కు వెళ్లగా.. రివ్యూ ఇంగ్లండ్కు అనుకూలంగా వచ్చింది. ఆ సంతోషంలో అండర్సన్ తన సహచర ఆటగాళ్ల దగ్గరికి వెళ్లి ఆనందంతో హత్తుకున్నాడు.
మొన్ననే కదా మెచ్చుకుంది:
'జేమ్స్ అండర్సన్ మొన్ననే కదా నిన్ను అంతలా మెచ్చుకుంది. ఇంతలోనే ఐసీసీ నిబంధనలు గాలికొదిలేస్తావా' అంటూ ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుసేన్ స్పందించాడు. 'వికెట్ తీశానన్న ఆనందంలో అండర్సన్ అలా చేసి ఉంటాడు. ఎంతైనా పాత పద్దతులు అంత తొందరగా జీర్ణం కావుగా' అంటూ ట్వీట్ చేశాడు.
విండీస్దే పైచేయి:
తొలి టెస్టులో ఇప్పటివరకైతే విండీస్దే పైచేయిగా నిలిచింది. మూడోరోజూ ఆతిథ్య ఇంగ్లండ్ బౌలర్లపై బ్యాట్స్మెన్ కూడా రాణించడంతో.. విండీస్కు ఆధిక్యం దక్కింది. క్రెయిగ్ బ్రాత్వైట్ (125 బంతుల్లో 65; 6 ఫోర్లు), డౌరిచ్ (115 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 102 ఓవర్లలో 318 పరుగుల వద్ద ఆలౌటైంది. దాంతో 114 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ (4/49), అండర్సన్ (3/62) రాణించారు.
ఇంకా 99 పరుగుల వెనుకంజలో:
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. బర్న్స్ 10 పరుగులతో, సిబ్లీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 99 పరుగుల వెనుకంజలో ఉంది. వర్షం కారణంగా మొదటి రోజు ఆట సరిగా జరగలేదు. రెండో రోజు వెలుతురు లేమితో ముందుగానే ముగించారు.