హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లోకి వచ్చిన 30 రోజుల్లోనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని జగన్ మోహన్ రావు తెలిపారు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ తనలా అపెక్స్ మెంబర్ కాకుండా ప్రెసిడెంట్గా ఎన్నికైన వారు లేరన్నారు. ఆ దేవుడి ఆశీస్సులతోనే తనకు ఈ అవకాశం దక్కిందని చెప్పారు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో Mykhel తెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్ మోహన్ రావు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఐకానిక్ మెల్బోర్న్ స్టేడియానికి ధీటుగా ఉప్పల్ స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్నామని తెలిపారు.
30 రోజుల్లోనే అధ్యక్షుడినయ్యా..
'హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేసిన నేను అనూహ్యంగా క్రికెట్వైపు వచ్చాను. ఆ దేవుడే నన్ను హెచ్సీఏ అధ్యక్షుడిగా పంపించాడని నేను భావిస్తాను. హ్యాండ్ బాల్ ఇండియా ప్రెసిడెంట్గా తెలుగు రాష్ట్రాల నుంచి పనిచేసిన ఏకైక వ్యక్తిని నేనే. హెచ్సీఏలోకి వచ్చిన 20-30 రోజుల్లోనే ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. దేశవ్యాప్తంగా ఎవరూ కూడా ఇలా అపెక్స్ మెంబర్ కాకుండా అధ్యక్షుడిగా ఎన్నికవ్వలేదు. ఆ అదృష్టం నాకే దక్కింది. హెచ్సీఏలో ప్రత్యక్షంగా పనిచేయకున్నా పరోక్షంగా క్రికెట్కు సేవలందించాను. గతంలో జరిగిన తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్)లో నేను ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాను. ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఓ టోర్నీలో కూడా నాకు ఓ జట్టు ఉంది. క్రీడలకు సేవ చేయడంతోనే నాకు హెచ్సీఏ అధ్యక్షుడిగా అవకాశం దక్కింది.

అమ్మాయిల కోసం..
మహిళల క్రికెట్ అభివృద్ధి కోసం హెచ్సీఏ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నా హయాంలోనే గొంగిడి త్రిష అండర్ 19 ప్రపంచకప్ ఆడి.. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రతిభ కలిగిన మహిళా క్రికెటర్లు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. పురుషుల క్రికెట్ అకాడమీ తరహాలోనే.. మహిళా క్రికెటర్ల కోసం అకాడమీ నిర్వహిస్తున్నాం. ప్రతిభాన్వేషణ కోసం సమ్మర్ క్యాంప్లు కూడా నిర్వహించాం. ఆ క్యాంప్ల ద్వారా కొత్తగా 20-30 మంది బాలికలు హెచ్సీఏలో రిజిస్టర్ అయ్యారు. మరింత ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు రిజిస్టర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
హైదరబాద్ ఇజ్జత్ నిలబెట్టాడు..
హెచ్సీఏ సెక్రటరీ దేవ్రాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన టీమిండియాకు మేనేజర్గా వ్యవహరించారు. ఆయనకు హెచ్సీఏ తరఫున అభినందనలు.. ధన్యవాదాలు. హైదరాబాద్ ఇజ్జత్ నిలబెట్టాడు. మాన్సింగ్ గారూ ఉన్నప్పుడు భారత్ కప్ గెలిచింది. మళ్లీ దేవ్రాజ్ ఆధ్వర్యంలోనే టైటిల్ దక్కింది. ఇది హెచ్సీఏతో పాటు తెలంగాణ మొత్తానికి గర్వకారణం. గతంలో కాకుండా టీమ్ వర్క్తో హెచ్సీఏను ముందుకు నడిపిస్తున్నా. సమష్టి నిర్ణయాలతో ముందుకెళ్తున్నాం. అందుకే అంతర్గత కుమ్ములాటలు లేవు. నాకు ఎవరితో గొడవలు లేవు. అపెక్స్ మెంబర్స్ అందరిని కలుపుకొని ముందుకు సాగుతున్నా.'అని జగన్మోహన్ రావు తెలిపారు.