
చెన్నై: ఫస్ట్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో తన బౌలింగ్ను టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ చితక్కొట్టిన తర్వాత మళ్లీ క్రికెట్ ఆడుతాననుకోలేదని ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ అన్నాడు. పంత్ అతని బౌలింగ్లోనే ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. లీచ్ బౌలింగ్లోనే మరో పది ఫోర్లు కూడా రాగా, మ్యాచ్ మూడో రోజు ఒక దశలో 8 ఓవర్ల వ్యవధిలో అతను ఏకంగా 77 పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫస్ట్ టెస్ట్లో తన పెర్ఫామెన్స్పై జాక్ లీచ్ స్పందించాడు.
'భారత్లో ఇది నా మొదటి సిరీస్. కానీ చాలా కఠినంగా ప్రారంభమైంది. భారత జట్టు మెరుపు బ్యాటింగ్ దెబ్బకు నా పరిస్థితి అంతా తలకిందులుగా మారిపోయింది. మూడో రోజు ఆటలో తొలి 8 ఓవర్లలో 77 పరుగులు సమర్పించుకున్నాక నేను మళ్లీ క్రికెట్ ఆడలేనని అనిపించింది. అయితే ఆ తర్వాత కోలుకొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం చాలా ఆనందం కలిగించింది. అయినా 227 పరుగులతో గెలిచిన తర్వాత ఏ బాధ అయినా మటుమాయం కావాల్సిందే. మ్యాచ్లో ఎన్నో రకాల భావోద్వేగాల అనంతరం గెలుపు రుచి చూశాను. అదే క్రికెట్ గొప్పతనమంటే' అని లీచ్ అన్నాడు.
ఇక రోహిత్ శర్మ వికెట్ తీయడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని, తన ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసిందని ఈ ఇంగ్లండ్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. 'నాలుగో రోజు చివరిలో రోహిత్ శర్మను ఔట్ చేయడం చాలా సంతోషాన్నించింది. సరైన సమయంలో ఆ వికెట్ దక్కడంతో నా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. రోహిత్ శర్మను ఔట్ చేసిన బంతిని భవిష్యత్తులో విజువలైజేషన్ సహాయంగా ఉపయోగించుకుంటాను.
ఈ వికెట్ దక్కడం వల్ల చివరి రోజు మా పని సులువైంది. భారత జట్టు బలమైనది. సెకండ్ టెస్ట్కు నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంటుంది. మేం కూడా ఆ విధంగానే సిద్దమవుతున్నాం. ఇక రోటేషన్ పాలసీలో భాగంగా జోస్ బట్లర్ మిగతా సిరీస్కు దూరమయ్యాడు. అతను వెళ్లడం కొంచెం బాధగానే ఉన్నా.. ఏ ఆటగాడికైనా విశ్రాంతి అవసరం.'అని లీచ్ చెప్పుకొచ్చాడు. శనివారం నుంచి చెన్నై వేదికగానే అభిమానుల సమక్షంలో రెండో టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ జోఫ్రా ఆర్చర్ సేవలు కోల్పోయింది.