ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(ఐవీపీఎల్) అరంగేట్ర సీజన్ను తెలంగాణ టైగర్స్ ఓటమితో ప్రారంభించింది. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలోని ముంబై ఛాంపియన్స్తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సారథ్యంలో బరిలోకి దిగిన తెలంగాణ టైగర్స్ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
గ్రేటర్ నోయిడాలోని షాహిద్ విజయ్ సింగ్ పతీక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంచై ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. ముంబై ఛాంపియన్స్ ఓపెనర్ ఫిల్ మస్టర్డ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 60), పీటర్ ట్రెగో(44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 92 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

తెలంగాణ టైగర్స్ బౌలర్లలో దిల్షాన్, రికార్డో పోవెల్, సయ్యద్ ఖాద్రీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన తెలంగాణ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసి ఓటమిపాలైంది. మన్ప్రీత్ గోనీ(38), రవి కుమార్(43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో పీటర్ ట్రెగో, అమిత్ సనన్, విశ్వవజిత్ సిన్ష్ సోలంకీ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్కు సెహ్వాగ్తో పాటు క్రిస్ గేల్ దూరంగా ఉన్నారు.