విరాట్ కోహ్లీకి నచ్చకపోతే జట్టులో చోటు దక్కదని, అందుకు అంబటి రాయుడే ఉదాహరణని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఈ కామెంట్స్పై స్పందించిన రాయుడు.. ఊతప్ప చెప్పింది నిజమేనన్నాడు. కోహ్లీకి నచ్చకపోతే జట్టులో కొనసాగలేమని స్పష్టం చేశాడు. కానీ 2019 వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి తనను తప్పించడం వెనుక విరాట్ కోహ్లీ లేడన్నాడు. ఏ ఒక్కరి నిర్ణయం కారణంగా తనపై వేటు వేయలేదని, టీమ్ మేనేజ్మెంట్ కలిసి సమష్టిగా తీసుకున్న నిర్ణయమని చెప్పాడు.
'భారత క్రికెట్లో ఆటగాళ్ల ఇష్టాలు, అయిష్టాల గురించి రాబిన్ ఊతప్ప చెప్పింది నిజమే. కానీ అది ఒక నిర్దిష్ట సమయానికి మాత్రమే పరిమితం. నేను ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ నాకు మద్దతుగా నిలిచాడని చెప్పాను. కానీ జనాలు ఏదో ఒక విషయాన్ని పట్టుకొని దాని గురించి మాట్లాడుతుంటారు. కానీ నన్ను తప్పించడం వెనుక విరాట్ కోహ్లీనే కాదు ఏ ఒక్కరు లేరు. అది టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం. ఈ విషయంలో ఏ ఒక్కర్ని నిందించలేం.

రాబిన్ ఊతప్ప చెప్పినట్లు నాకు 2019 వన్డే ప్రపంచకప్ కోసం జెర్సీ, కిట్ అందాయి. ఎందుకంటే మెగా టోర్నీ కోసం 20-25 మంది ఆటగాళ్లను సిద్దం చేస్తారు. ఆ క్రమంలో నాకు కూడా జెర్సీ, కిట్ వచ్చాయి. ప్రపంచకప్ ప్రాబబుల్స్లో ఉన్న 25 మంది ఆటగాళ్ల వీసాలు, జెర్సీలు సిద్దం చేస్తారు. చివరి నిమిషంలో అన్ని పనులు చేయడం కష్టం కాబట్టి ముందే చేస్తారు. ఆ తర్వాతే జట్టు ఎంపిక జరుగుతుంది. నన్ను జట్టులో నుంచి తీసేయలేదు. ప్రాబబుల్స్ నుంచి పక్కనపెట్టారు.
నన్ను పక్కనపెట్టినందుకు నేను బాధపడలేదు. కానీ నెంబర్ 4లో బ్యాటర్ లేకుంటే ఎలా? ఆ స్థానంలో ఆల్రౌండర్ను ఎలా ఆడిస్తారనేది నిరాశకు గురి చేసింది. నెంబర్ 4లో బ్యాటింగ్ చేసేందుకు 3 డైమెన్షనల్ ఆటగాడు ఎందుకు? టాపార్డర్, మిడిలార్డర్ల మధ్య వారధిగా ఉండే బ్యాటర్ అవసరం అనేదే నా బాధ. కానీ ఇది ఎవరూ అర్థం చేసుకోలేదు.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
2019 వన్డే ప్రపంచకప్ జట్టులో తనకు అవకాశం రాకపోవడంపై అప్పట్లో అంబటి రాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమ్మెస్కే ప్రసాద్ కారణంగానే తనకు అవకాశం రాలేదని ఆరోపించాడు. టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ అతను చేసిన త్రీడీ ట్వీట్ నెట్టింట తీవ్ర దుమారం రేపింది. చివరకు ప్రాబబుల్స్లో ఉన్న రాయుడికి ఆటగాళ్లు గాయపడినా అవకాశం దక్కలేదు.