టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) వివాదాస్పద చర్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా మాజీ పేసర్ శ్రీశాంత్తో గంభీర్ గొడవ పడిన విషయం తెలిసిందే. తనను ఫిక్సర్ అంటూ గంభీర్ పదే పదే దూషించాడని, బూతు పదం కూడా ఉపయోగించాడని శ్రీశాంత్.. సోషల్ మీడియా వేదికగా ఈ గొడవకు గల కారణాన్ని తెలియజేస్తూ వివరణ ఇచ్చాడు.
గంభీర్ మాత్రం.. 'ప్రపంచం మొత్తం మనల్నే ఫోకస్ చేసినప్పుడు ఓ చిరు నవ్వు చిందించండి'అని తాను నవ్వుతున్న ఓ ఫొటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్పై కూడా శ్రీశాంత్ ఘాటుగా స్పందించాడు. అన్యాయంగా తనను తిట్టాడని, ఆ దేవుడు క్షమించడని కామెంట్ చేశాడు. గంభీర్పై తనకు ఎంతో గౌరవం ఉండేదని, ఈ ఘటనతో పూర్తిగా పోయిందని రాసుకొచ్చాడు.

సీనియర్ ఆటగాళ్లు అన్నా.. సహచర ప్లేయర్లన్నా గంభీర్కు కనీస గౌరవం ఉండదని ఆరోపించాడు. ఇక ఐపీఎల్ 2023 సీజన్లో ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్ ఉల్ హక్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం అత్యంత వివాదాస్పద ఘటనగా నిలిచిపోయింది. మైదానంలో కోహ్లీ-నవీన్ ఉల్ హక్ గొడవపడగా.. మ్యాచ్ అనంతరం కోహ్లీతో లక్నో మెంటార్ అయిన గంభీర్ వాగ్వాదానికి దిగాడు.
ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడం.. సహచర ఆటగాళ్లు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ఘటనపై స్పందించిన గంభీర్.. తన చర్యను సమర్థించుకున్నాడు. కోహ్లీతో గొడవపడటం మెంటార్గా తన బాధ్యత అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పోడ్కాస్ట్లో మాట్లాడిన గంభీర్.. ఈ ఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఓ మెంటార్గా.. నా ముందు నా ఆటగాళ్లతో ఎవరు కూడా వాగ్వాదానికి దిగవద్దు. మెంటార్ ఎప్పుడూ ఆటగాళ్లకు అండగా నిలవాలనేది నా నమ్మకం. మ్యాచ్ మధ్యలో నవీన్ ఉల్ హక్- కోహ్లీ మధ్య గొడవ జరిగింది. మ్యాచ్ జరగుతున్నప్పుడు జోక్యం చేసుకోవడానికి మెంటార్గా నాకు ఎలాంటి హక్కు లేదు.
కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా మా ఆటగాళ్లతో తీవ్ర వాగ్వాదానికి దిగితే మాత్రం వారిని రక్షించుకునేందుకు మెంటార్గా నాకు పూర్తి హక్కు ఉంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కోహ్లీతో గొడవ కారణంగా గంభీర్.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టును వీడాల్సి వచ్చింది. గంభీర్-కోహ్లీ గొడవ కారణంగా.. ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ పోరు దాయాదీల సమరంగా మారిపోయింది.
అభిమానులంతా లక్నోను అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. దాంతో ఈ ఘటనను లక్నో మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకుంది. ముందుగా ఈ గొడవకు కారణమైన గంభీర్పై వేటు వేసింది. దాంతో అతను కోల్కతా నైట్రైడర్స్ జట్టులో మెంటార్గా చేరిపోయాడు.