Wayne Madsen: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఘటనకు వేదికగా నిలవనుంది. ఇప్పటి వరకు ఒకే ఆటగాడు రెండు దేశాల తరఫున క్రికెట్ ఆడిన ఘటనలు చూశాం. కానీ రెండు దేశాల తరఫున వేర్వేరు క్రీడల్లో వరల్డ్ కప్లో పాల్గొన్న అరుదైన ఘట్టం తొలిసారి చోటు చేసుకోనుంది.
2006లో సౌతాఫ్రికా తరఫున హాకీ వరల్డ్ కప్ ఆడిన వేన్ మ్యాడ్సన్ 20 ఏళ్ల తర్వాత ఇటలీ కెప్టెన్గా టీ20 ప్రపంచకప్ 2026లో బరిలో దిగనున్నాడు. తొలిసారి ఇటలీ టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించగా.. అతను ఆ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అతను గతంలో పీఎస్ఎల్, బీపీఎల్, హండ్రెడ్ లీగ్లోనూ ఆడాడు. ఇటలీ తరఫున 2023లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.
ఇప్పటి వరకు 7 అంతర్జాతీయ టీ20లు ఆడిన వేన్ మ్యాడ్సన్ 34.16 సగటు, స్ట్రైక్ రేట్: 132.26తో 205 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 61 నాటౌట్. దేశవాళీ క్రికెట్లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో 'డెర్బీషైర్' జట్టుకు సుదీర్ఘకాలం ఆడాడు. అక్కడ టీ20 ఫార్మాట్లో ఒక సెంచరీ (100*) కూడా నమోదు చేశాడు. 5,500 పరుగులతో డెర్బీషైర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

మ్యాడ్సన్ పీఎస్ఎల్లో రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో పెషావర్ జల్మీ , 2020లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు మిడిలార్డర్ బ్యాటర్గా ప్రాతినిథ్యం వహించాడు. దిహండ్రెడ్ లీగ్లో 2021 నుంచి 2024 వరకు మాంచెస్టర్ ఒరిజినల్కు జట్టుకు ఆడిన మ్యాడ్సన్.. 2025లో లండన్ స్పిరిట్ జట్టుకు ఎంపికయ్యాడు. మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున 2022లో 9 ఇన్నింగ్స్ల్లో 162 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్థ శతకం (53) ఉంది. ఆ సీజన్ ఫైనల్లోనూ బరిలోకి దిగాడు. బంగ్లాదేశ్ లీగ్లో రంగ్పూర్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
క్రికెట్లోకి రాకముందు మ్యాడ్సన్ సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ హాకీ ఆడాడు. 39 అంతర్జాతీయ మ్యాచ్ల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. జర్మనీ వేదికగా జరిగిన 2006 హాకీ ప్రపంచకప్తో పాటు అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగాడు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత క్రికెట్ ప్రపంచకప్లో బరిలోకి దిగుతున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కనున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, స్కాట్లాండ్లతో గ్రూప్సీలో ఇటలీ ఉంది. ఫిబ్రవరి 9న స్కాట్లాండ్తో జరిగే తొలి మ్యాచ్తో ఇటలీ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. ఫిబ్రవరి 12న నేపాల్, ఫిబ్రవరి 16న ఇంగ్లండ్, ఫిబ్రవరి 19న వెస్టిండీస్తో తదుపరి మ్యాచ్లు ఆడనుంది.