
అల్లాటప్ప షాక్ కాదు..
పాకిస్తాన్కు జింబాబ్వే ఇచ్చిన షాక్ అలాంటిలాంటిది కాదు. తేరుకోలేకపోతోంది బాబర్ ఆజమ్ సేన. వరుసగా రెండు మ్యాచ్లల్లో ఓడిన ప్రభావం జట్టుపై తీవ్రంగా పడింది. భారత్ చేతిలో పరాజయాన్ని చవి చూడటం ఒక ఎత్తయితే- జింబాబ్వేను గెలవలేకపోవడం మరో ఎత్తుగా మారింది పాకిస్తాన్కు. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. జట్టు మొత్తాన్నీ నిరుత్సాహానికి గురి చేసింది ఈ పరాజయం. ఓటమి మిగిల్చిన నిరాశ ఆవరించిందా జట్టు డ్రెస్సింగ్ రూమ్లో.

ఎల్లుండి తదుపరి మ్యాచ్,.
ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ జట్టు తన తదుపరి మ్యాచ్ను ఈ నెల 30వ తేదీన ఆడబోతోంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆరంభమౌతుంది. పెర్త్ స్టేడియం దీనికి వేదిక. నెదర్లాండ్స్ను ఢీ కొట్టబోతోంది బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు. వరుసగా రెండు పరాజయాలను చవి చూసిన తరువాత మూడో మ్యాచ్ ఆడబోతోన్న నేపథ్యంలో అందరి దృష్టీ ఆ టీమ్ మీదే ఉంది. కేప్టెన్ బాబర్ ఆజమ్ సెంటర్ ఆఫ్ ది పాయింట్గా మారాడు.

సెమీస్ చేరలేం..
టీ20 ప్రపంచకప్లో తన జట్టు ప్రస్థానం గురించి మాట్లాడాడు. సెమీ ఫైనల్స్కు వెళ్లలేమని, అది కష్టసాధ్యమని తేల్చి చెప్పాడు బాబర్ ఆజమ్. తాను ఈ విషయాన్ని నిజాయితీగా చెబుతున్నానని పేర్కొన్నాడు. సెమీస్ చేరే అవకాశాలు లేవని స్పష్టం చేశాడు. టోర్నమెంట్లో ముందడుగు వేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉందని, దాని కోసం కష్టపడుతున్నామని, వరుస ఓటములు తమను నిరాశకు గురి చేశాయనే విషయాన్ని తాను అంగీకరిస్తోన్నానని బాబర్ ఆజమ్ వ్యాఖ్యానించాడు.

జింబాబ్వేపై అలా..
పెర్త్లో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఎనిమిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా.. పాకిస్తాన్ ఆ టార్గెట్ను అందుకోలేకపోయింది. ఒక్క పరుగు తేడాతో పరాజయాన్ని చవి చూసింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. అంతకుముందు భారత్పై చివరి ఓవర్ థ్రిల్లర్లో ఓడింది పాకిస్తాన్. విరాట్ కోహ్లీ-హార్దిక్ పాండ్యా ద్వయం టీమిండియాను గెలిపించింది.


Click it and Unblock the Notifications

ఐర్లాండా..మజాకా - టీమిండియా తరువాత అదే..!!