ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహనం కోల్పోయాడు. టెక్నాలజీనే తప్పుబడుతూ.. ఫీల్డ్ అంపైర్పై అసహనం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
నాలుగో రోజు ఆట తొలి సెషన్ 55వ ఓవర్లో 99 పరుగుల వద్ద ఉన్న జాన్ కాంప్బెల్ ఎల్బీ కోసం బుమ్రా గట్టిగా అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ నాటౌట్ ఇచ్చాడు. దాంతో శుభ్మన్ గిల్ను కన్విన్స్ చేసి మరి బుమ్రా రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ సమీక్షలో బంతి ప్యాడ్తో పాటు బ్యాట్ను తాకినట్లు కనిపించింది.
స్నీకో మీటర్లో స్పైక్ రావడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే బుమ్రా మాత్రం బంతి ప్యాడ్ను తాకిన తర్వాతే బ్యాట్ను తాకిందని భావించాడు. దాంతో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని బుమ్రా తప్పుబట్టాడు. ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 'అది ఔట్ అని మీకు తెలుసు. కానీ టెక్నాలజీ నిరూపించలేకపోయింది.'అని బుమ్రా అన్నాడు. ఈ మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోపై భారత అభిమానులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఔట్ అంటే మరికొందరు నాటౌట్ అని కామెంట్ చేస్తున్నారు. బుమ్రాకే కోపం వచ్చిందంటే.. అది కచ్చితంగా ఔటేనని అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్లో వెస్టిండీస్ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్.. రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. జాన్ కాంప్బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 115) సెంచరీతో రాణించగా.. షై హోప్(199 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 97 నాటౌట్) శతకం ముంగిట నిలిచాడు.
ప్రస్తుతం వెస్టిండీస్ 81 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. భారత్ స్కోర్ కంటే మరో 7 పరుగులు మాత్రం వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో సిరాజ్, జడేజా, సుందర్ చెరో వికెట్ తీసాడు. వెస్టిండీస్ను ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై విండీస్ బ్యాటర్లు కట్టడి చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.