
బంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ అదిరిపోయే విజయాన్నందుకుంది. డీ షార్న్ బ్రౌన్(6, 9వ నిమిషాల్లో) రెండు గోల్స్తో అదరగొట్టడంతో పటిష్ట మంబై సిటీ ఫుట్బాల్ క్లబ్కు లీగ్లో నార్త్ఈస్ట్ రెండోసారి షాకిచ్చింది. శనివారం జీఎంసీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో నార్త్ఈస్ట్ 2-1 తేడాతో ముంబై సిటీ ఎఫ్సీపై ఘన విజయం సాధించింది. ముంబై తరఫున ఆడమ్ లీ ఫాండ్రే(85వ నిమిషం) ఏకైక గోల్ అందించాడు.
మ్యాచ్ ప్రారంభమైన 6వ నిమిషంలో డీషార్న్ సూపర్ గోల్తో నార్త్ఈస్ట్కు శుభారంభాన్ని అందించాడు. అనంతరం మరో మూడు నిమిషాల వ్యవధిలోనే మరో గోల్ కొట్టి ఆ ఆనందాన్ని రెట్టింపు చేయడంతో పాటు నార్త్ఈస్ట్ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా తలపడంతో మరో గోల్ నమోదవ్వకుండానే ఫస్టాఫ్ ముగిసింది. సెకండాఫ్లో కూడా ఇరు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. ఇరు జట్ల డిఫెన్స్ మైదానంలో సమర్థవంతంగా కదిలాయి.
ఇక ఆట 85వ నిమిషంలో సహచరుడి పాస్తో ఆడమ్ లీ ఫాండ్రే గోల్ కొట్టి ముంబై జట్టులో ఆశలు రెకెత్తించినా.. ఆ తర్వాత నార్త్ఈస్ట్ మరో అవకాశం ఇవ్వలేదు. ఇంజ్యూరీ టైమ్లో కూడా గోల్స్ రాకపోవడంతో నార్త్ ఈస్ట్ విజయం లాంఛనమైంది.
ఈ గెలుపుతో నార్త్ఈస్ట్ నాలుగో ప్లేస్లోకి దూసుకెళ్లగా.. ముంబై సిటీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన ముంబై సిటీ కేవలం రెండింటిలోనే ఓడిపోయింది. ఆ రెండు కూడా నార్త్ ఈస్ట్ చేతిలోనే కావడం గమనార్హం.