న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పక ముందే కొందరు ఆటగాళ్లు క్రికెట్ ఎక్స్పర్ట్స్, కామెంటేటర్లుగా అవతారమెత్తుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023 సీజన్కు దూరంగా ఉన్న ఆసీస్ వెటరన్ స్టీవ్ స్మిత్ ఎక్స్పర్ట్గా మారాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకకముందే హర్భజన్ సింగ్, దినేశ్ కార్తీక్లు కామెంటేటర్లుగా అవతారమెత్తారు.
తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ చేరాడు. భారత్-వెస్టిండీస్ మధ్య జరగనున్న టెస్ట్, వన్డే, టీ20 సిరీస్లకు కామెంటేటర్గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు అతడు జియో సినిమాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని జియో సినిమా కూడా ధ్రువీకరించింది. ఇషాంత్ శర్మ హిందీ కామెంటేటర్గా కనిపించనున్నాడు.

బుధవారం నుంచే (జులై 12) డొమినికా వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ పర్యటనకు సంబంధించిన మ్యాచ్లను జియో సినిమా ఉచితంగా ప్రసారం చేయనుంది. జియో సినిమాతో పాటు ఫ్యాన్ కోడ్, దూరదర్శన్ చానెల్స్లో ఈ మ్యాచ్లు రానున్నాయి.
ఇషాంత్ శర్మ తన కెరీర్లో ఇప్పటివరకు 105 టెస్టులు ఆడి 311 వికెట్లు పడగొట్టాడు. 80 వన్డేల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి 115 వికెట్లు, 14 టీ20 మ్యాచ్లు ఆడి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరఫున చివరగా 2021 నవంబర్లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆడాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాంత్ శర్మ.. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.
ఇక, విండీస్తో తొలి టెస్టులో భారతే ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా.. శుభ్మన్ గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయనున్నాడు. మూడో పేసర్గా జయదేవ్ ఉనాద్కత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
వికెట్ కీపర్గా తెలుగు తేజం కేఎస్ భరత్కు మరో అవకాశం ఇస్తారా? లేక ఇషాన్ కిషన్ను ఆడిస్తారా? అనేది చూడాలి.