న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. అందరూ అనుకునేంత మిస్టర్ కూల్ కాదని వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. అతను కూడా ఆటగాళ్లపై అరుస్తాడని, మైదానంలో తప్పులు చేస్తే ఎవ్వరని చూడకుండా తిడుతాడని తెలిపాడు. విరాట్ కోహ్లీతో పాటు తాను కూడా ధోనీ ఆగ్రహానికి గురయ్యానని గుర్తు చేసుకున్నాడు.
తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ధోనీ నిశబ్దంగా ఓ మూలన కూర్చున్నాడంటే.. అతను ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నాడని అర్థం. ఆ సమయంలో ఎవరైనా అతన్ని డిస్టర్బ్ చేస్తే వాడికి బండ బూతులు ఉండేవి. అందరూ ధోనీని మిస్టర్ కూల్ అంటారు. కానీ ధోనీ అంత కూల్ ఏం కాదు.

అలాగని తరుచూ కోప్పడేవాడు కాదు. ఫీల్డ్లో తప్పిదాలు చేస్తే అరిచేవాడు. నన్ను కూడా చాలా సార్లు తిట్టాడు. ఒకటి రెండు సార్లు ధోనీని చూసి భయపడ్డాను. ఫీల్డర్ వేసిన త్రో అతని గ్లోవ్స్ దాకా వెళ్లకుంటే ధోనీకి తీవ్ర కోపం వస్తుంది. చేతుల్లోకి ఇవ్వచ్చు కదా? అని మండిపడుతాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో నేను చేసిన ఓ తప్పిదంతో ధోనీకి విపరీతమైన కోపం వచ్చింది.
ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్బంగా క్రీజులో సెట్ అయిన రవి బోపారా క్యాచ్ నేలపాలు చేయడంతో ధోనీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నువ్వు ఫీల్డింగ్ చేయలేకపోతే అక్కడ నిలబడకంటూ అరిచాడు. నేను సైలెంట్గా వెళ్లిపోయాను. నేనే కాదు కోహ్లీని కూడా చాలా సార్లు తిట్టాడు. అయితే తిట్టిన తర్వాత తమ్ముడిలా అనుకొని చెప్పానని వివరణ ఇచ్చేవాడు.
ఎందుకిలా ఊరికే తిడతావని అడిగితే, నాకు నువ్వంటే అంత ఇష్టం అని బదులిచ్చాడు. ఆస్ట్రేలియాతో ఓ టెస్ట్ మ్యాచ్లో శిఖర్ ధావన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను బ్యాటింగ్ రాలేని స్థితి నెలకొంది. అయితే ఆ మ్యాచ్లో కోహ్లీ నిర్లక్ష్యపు షాట్తో వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ గెలిచినా.. కోహ్లీని ధోనీ మందలించాడు. ధావన్ పరిస్థితి తెలిసి కూడా అలా ఎందుకు ఔటయ్యావని నిలదీసాడు.'అని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు.