న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను ఆడిన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ సారథని కొనియాడాడు. అతని పర్యవేక్షణలోనే తాను అత్యుత్తమ బౌలింగ్ చేశానని గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ సారథ్యంలో భారత పేసర్లు దుమ్మురేపారని తెలిపాడు.
పేస్ బౌలర్లకు విరాట్ కోహ్లీ అండగా నిలిచేవాడని చెప్పాడు. విరాట్ కోహ్లీలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని తాను చూడలేదని ప్రశంసించాడు. తాజాగా ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్ శర్మ.. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'విరాట్ కోహ్లీ సారథ్యంలోనే నా బౌలింగ్ ఎంతో మారింది. అతను ప్రతీ బౌలర్ను గొప్పగా అర్థం చేసుకుంటాడు. ప్రతీ ఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడేవాడు. 'మీరు నిలకడగా బౌలింగ్ చేస్తారనే విషయం నాకు తెలుసు. కానీ అంతకుమించిన ప్రదర్శనతో వికెట్లు తీస్తారని ఆశిస్తున్నా.'అని ఎల్లప్పుడూ చెప్పేవాడు.
విరాట్ కోహ్లీ సారథ్యంలో ఫాస్ట్ బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఎందుకంటే ప్రతీ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయగలరని అతను నమ్మేవాడు. ప్రతీ ఒక్కరికి అండగా నిలిచేవాడు. ఎప్పుడూ బ్యాటర్లపై అటాక్ చేయమని చెప్పేవాడు. విఫలమైనా.. పరుగులిచ్చినా అండగా నిలిచి ప్రోత్సహించేవాడు.

ప్రతీ ఒక్కరితో మాట్లాడుతుండేవాడు. జట్టులోని బౌలర్ల పాత్ర గురించి వివరిస్తూ ఆందోళన చెందకుండా చూసుకునేవాడు. విరాట్ కోహ్లీ ఎంతో కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఒకసారి ఏదో పని మీద కోహ్లీ అమెరికాకు వెళ్లాడు. అతనితో నేను కూడా ఉన్నాను. విమానం ల్యాండ్ అయ్యేవరకు కోహ్లీ పడుకున్నాడు.
దిగిన వెంటనే ముందుగా జిమ్లోకి వెళ్లాడు. ఆ తర్వాతే తన పనిని పూర్తి చేసుకున్నాడు. భారత్కు రిటర్న్ వచ్చే క్రమంలోనూ ఫ్లైట్లో నిద్రపోయిన కోహ్లీ.. దిగగానే మళ్లీ జిమ్లోకే పరుగెత్తాడు. చాలా మందికి ఈ విషయం తెలియదు. కోహ్లీ డెడికేషన్కు ఇది నిదర్శనం. నేను ఆడిన సారథుల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమం.'అని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు.